కేసీఆర్ సర్కారుకు దిమ్మతిరిగే షాక్.. సెక్రటేరియట్ కూచ్చివేతపై హైకోర్టు స్టే.. అంత తొందరేంటని ఫైర్
కొత్త సెక్రటేరియట్ నిర్మాణం విషయంలో కేసీఆర్ సర్కారుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పుడున్న సెక్రటేరియట్ బిల్డింగ్స్ ను కూల్చరాదంటూ హైకోర్టు స్టే విధించింది. ఈ మేరకు సీజే రాఘవేంద్రసింగ్ చౌహాన్ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం ఆదేశాలిచ్చింది. సరిగ్గా మూడు వారాల కిందటే కొత్త డిజైన్లు తయారుచేసుకోవచ్చని చెప్పిన కోర్టు... అంతలోనే కూల్చివేతలపై స్టే ఇవ్వడం ప్రభుత్వానికి ఇబ్బందికర పరిణామంలా మారింది. విచారణ సందర్భంగా కేసీఆర్ సర్కారుపై జడ్జిలు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

డిజైన్లు లేకుండా కూల్చుడేంది?
‘‘భవనాల్ని కూలగొట్టడానికి మీకు(ప్రభుత్వానికి) ఎందుకంత తొందర? కొత్త సెక్రటిరేట్ నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందా? కొత్త డిజైన్లు, ఆర్థిక పరమైన అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపిందా? అసలు డిజైన్లు, డీపీఆర్ లు సిద్ధంగా ఉన్నాయా? అవి లేకుండా ఇప్పటికిప్పుడు బిల్డింగ్స్ ను కూల్చి ఏంటి ప్రయోజనం? టెక్నాలజీ ఇంతగా అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా మీరు డిజైన్లు ఖరారు చేయలేరా?'' అంటూ ప్రభుత్వ తరఫు లాయర్ పై జడ్జిలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అప్పటిదాకా కూల్చొద్దు..
కొత్త సెక్రటేరియట్ కు సంబంధించిన డిజైన్లు, ఆర్థికపరమైన అంశాలపై కేబినెట్ ఫైనల్ నిర్ణయం తీసుకున్న తర్వాత, సంబంధిత రిపోర్టులను సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అప్పటిదాకా భవంతుల కూల్చివేతను చేపట్టొద్దంటూ స్టే ఉత్తర్వులు జారీచేసింది. తదుపరి విచారణను వాయిదా వేస్తూ, ఆలోగా రిపోర్టులు రెడీ చేసుకోవాలని సర్కారీ న్యాయవాదికి సూచించింది. నిజానికి మూడు వారాల కిందట జరిగిన విచారణలోనే.. డిజైన్లు, రిపోర్టులు సిద్ధం చేసుకోవాలని హైకోర్టు సూచించింది. కానీ ప్రభుత్వం మాత్రం ఆమేరకు సన్నద్ధం కాకపోయేసరికి జడ్జిలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అసలేం జరగిందంటే..
హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ పక్కనున్న సెక్రటేరియట్ భవనాలు సౌకర్యవంతంగా లేవని, వాటిని కూల్చేసి అక్కడే కొత్త సెక్రటేరియట్ నిర్మించాలని ప్రభుత్వం చాలా కాలంకిందటే డిసైడ్ కావడం, భవంతుల్ని కూల్చేందుకు వీలుగా సెక్రటేరియట్ ప్రధాన శాఖల్ని బూర్గుల రామకృష్ణారావు భవన్(బీఆర్కే భవన్)కు, మిగతా శాఖల కార్యాలయాన్ని వేర్వేరు చోట్లకు తరలించడం తెలిసిందే. ఈలోపే సచివాలయ భవనాలు కూల్చివేయరాదంటూ కాంగ్రెస్ ఎంపీ రేవంత్రెడ్డి, రిటైర్డ్ ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు, న్యాయవాది టి. రజనీకాంత్రెడ్డి వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు వేశారు. ఒకదశలో కోర్టు.. ప్రభుత్వం వైపే మొగ్గుచూపినప్పటికీ.. ప్రక్రియ అమలులో జాప్యం కారణంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఏజీకి చివాట్లు..
కొత్త సెక్రటేరియట్ బిల్డింగ్స్ కు సంబంధించిన ప్లాన్ సిద్ధం కాలేదని ప్రభుత్వం తరఫున అదనపు ఏజీ జె.రామచంద్రరావు చెప్పడంతో జడ్జిలు మండిపడ్డారు. కోర్టులో పిటిషన్లు విచారణలో ఉన్నందుకే నిర్ణయాలు తీసుకోవడం ఆలస్యమవుతోందన్న ఏజీ వాదనను జడ్జిలు తోసిపుచ్చారు. గత విచారణలోనే డిజైన్లు, ఆర్థిక రిపోర్టులు తయారు చేసుకోవాలని చెప్పిన విషయాన్ని జడ్జిలు గుర్తుచేశారు. సమగ్ర డిజైన్లు కోర్టు పరిశీలనకివ్వాలని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications