తెలంగాణ..అలర్ట్: మరో మూడు రోజులూ ఇదే పరిస్థితి: నార్త్ జిల్లాల్లో భీకర వడగాలులు
హైదరాబాద్: తెలంగాణలో క్రమంగా ఎండ తీవ్రత పెరుగుతోంది. ఎండలు ముదురుతున్నాయి. ఏ వేసవి సీజన్లో అయినా పగటి ఉష్ణోగ్రత రికార్డు స్థాయిలో నమోదయ్య ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఈ సారి కూడా అదే తీవ్రత కొనసాగనుంది. ఈ సీజన్ ఆరంభంలోనే అదరగొడుతున్న ఎండల తీవ్రత.. ఇక నడి వేసవి నాటికి మరింత ఉధృతంగా ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. సగటు ఉష్ణోగ్రత మరింత పెరిగే అవకాశం లేకపోలేదని భారత వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. మిడ్ సమ్మర్లో ఎండ తీవ్రత 46 డిగ్రీలు, అంతకంటే ఎక్కువ స్థాయిలోనే రికార్డ్ కావొచ్చని అంచనా వేస్తోన్నారు.
రెండు మూడు రోజులుగా ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతోంది. ఉత్తరాది వైపు నుంచి తక్కువ ఎత్తులో వీస్తోన్న వేడి గాలుల ఫలితంగా పగటి ఉష్ణోగ్రతలో అనూహ్య పెరుగుదల నమోదవుతోందని వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేస్తోన్నారు. వడగాలుల ఉధృతి మరో మూడు రోజుల పాటు కొనసాగుతుందని తెలిపారు. ఉత్తర తెలంగాణ మీదుగా వీస్తోన్న వడగాలులు వచ్చే మూడు రోజుల్లో రాష్ట్రమంతటా విస్తరిస్తాయని పేర్కొన్నారు. ఈ మూడు రోజుల్లో సగటున 44 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని వివరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్-42, నిజామాబాద్-41.4, దుండిగల్-40.5, రామగుండం-40.4, మహబూబ్ నగర్-40ల మేర ఉష్ణోగ్రత నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, ములుగు, నల్లగొండ, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, సంగారెడ్డి, మెదక్, సిద్ధిపేట్ వంటి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వచ్చే మూడు రోజుల్లో సాధారణ ఉష్ణోగ్రతలో రెండు నుంచి మూడు డిగ్రీల మేర పెరుగుదల ఉండొచ్చని అంచనా వేసింది.