అమిత్ షా వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడటం విడ్డూరం: కేటీఆర్
తెలంగాణలో అమిత్ షా పర్యటన కొనసాగింది. అధికార టీఆర్ఎస్ పార్టీ కూడా అదేవిధంగా స్పందించింది. మంత్రి కేటీఆర్.. అమిత్ షాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. వారసత్వ రాజకీయాల గురించి ఆయన కామెంట్స్ చేశారు. వారింట్లో ముగ్గురు పదవులు పొందుతున్నవారు ఉన్నారని.. పైగా ఇతరులపై కామెంట్స్ చేస్తారని విరుచుకుపడ్డారు.
బీసీసీఐ సెక్రటరీగా ఎదిగిన జై షా గురించి ప్రస్తావించారు. అతని మరో కుమారుడు కూడా ఉన్నత స్థానంలో ఉన్నారని వివరించారు. పైగా అమిత్ షా వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడుతారని పేర్కొన్నారు. వారివే వారసత్వ రాజకీయాలు అని కేటీఆర్ విరుచుకుపడ్డారు.
మునుగోడు సభలో అమిత్ షా పాల్గొన్న సంగతి తెలిసిందే. కేసీఆర్, కేటీఆర్ లక్ష్యంగా విమర్శలు చేశారు. తెలంగాణ రాష్ట్రం కల్వకుంట్ల చేతిలో బందీగా ఉందని ఫైరయ్యారు. కోమటిరెడ్డి రాజగోపాల్ సహా ఇతర నేతలు అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు. అంతకుముందే కేటీఆర్ ట్వీట్ చేశారు.
నిన్న సీఎం కేసీఆర్ సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ మరునాడు అమిత్ షా సభ జరిగింది. కేంద్ర ప్రభుత్వంపై కేసీఆర్ విరుచుకుపడ్డారు. తమ ప్రభుత్వంపై కేంద్రం వివక్ష చూపిస్తోందని మండిపడ్డారు. రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన ఆదాయం ఇవ్వడం లేదని కామెంట్ చేశారు. ఏదో సాకులు చెబుతూ కాలం వెళ్లదీస్తోందని కేసీఆర్ ఫైరయ్యారు. ఆ వెంటనే అమిత్ షా వాటిని తిప్పికొట్టారు. ఇచ్చిన హామీలను విస్మరించారని మండిపడ్డారు. ప్రజలను మోసం చేయడంలో ఆయనకు వెన్నతో పెట్టిన విద్యగా మారిందని ఫైరయ్యారు.