పనిలేని దద్దమ్మలు .. ముట్టడి డ్రామాలు .. ప్రతిపక్ష పార్టీలపై మంత్రి తలసాని ఫైర్
తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విపక్ష పార్టీల పై విరుచుకుపడ్డారు. చేతకాని దద్దమ్మలు, అభివృద్ధిని అడ్డుకోవడానికి కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. పని పాట లేని దద్దమ్మలు జనాల్లో మేం కూడా ఉన్నాం అని చెప్పుకోవడం కోసమే ఏదో ఒక వంకతో ముట్టడి డ్రామాలాడుతున్నారని తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు.
నేడు కరోనా కట్టడి లో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని ప్రగతి భవన్ ముట్టడికి యత్నించిన విపక్ష పార్టీల నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. సీఎం క్యాంపు కార్యాలయానికి బయల్దేరిన పలువురు నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని పోలీస్ స్టేషన్లకు తరలించారు. ప్రగతి భవన్ ముట్టడి నేపథ్యంలో పెద్ద సంఖ్యలో పోలీసులు ప్రగతి భవన్ వద్ద మోహరించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ని, తెలుగుదేశం పార్టీ తెలంగాణ అధ్యక్షులు ఎల్ రమణ ను,అలాగే టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం తో పాటు పలువురు విపక్ష పార్టీల నేతలను అరెస్ట్ చేశారు.
ఈ ముట్టడి పై మండిపడిన తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రగతి భవన్ ను ముట్టడించి అడ్డంకులు సృష్టించాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం ప్రజలు తమను మరిచిపోతారు అన్న భయంతోనే ముట్టడి డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు.మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామస్వరాజ్యం తీసుకురావడం కోసం పంచాయతీరాజ్ చట్టం లో సవరణలు తీసుకు వచ్చామని చెప్పిన మంత్రి, పల్లె పల్లెలో రైతుల కోసం అన్ని వనరులను సమకూరుస్తామని పేర్కొన్నారు.
దేశంలోనే 55 శాతం పంటలు తెలంగాణ రాష్ట్రంలోనే పండు తున్నాయని పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ లో పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కరోనా సమయంలో కూడా తెలంగాణ ప్రభుత్వం రైతులు పండించిన పంటను కొనుగోలు చేసిందని పేర్కొన్నారు.