ఎన్నికల వేళ ఉత్కంఠ : ఏపీ పోలీస్ అధికారిని అరెస్ట్ చేసిన తెలంగాణ పోలీసులు
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఇక్కడేం పనంటూ టీఆర్ఎస్ అధినేత మాటల తూటాలు పేల్చుతున్నారు. ఇలా ఎన్నికల సందర్భంగా రెండు రాష్ట్రాల్లో ఉత్కంఠ పరిణామాలు కనిపిస్తున్నాయి. ఏపీ ప్రజలు సైతం తెలంగాణ ఎన్నికలను నిశితంగా గమనిస్తున్నారు. ఈక్రమంలో ఏపీ పోలీస్ అధికారిని తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకోవడం హాట్ టాపిక్ గా మారింది.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ కు చెందిన పోలీసాధికారిని తెలంగాణ పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు? ఏపీకి వెళ్లి మరీ అరెస్ట్ చేశారంటే కథ పెద్దదేనా? ఇలాంటి ప్రశ్నలు సోషల్ మీడియాలో కనిపించడంతో ఈ అంశం మరింత కీలకంగా మారింది.
ఎన్నికల వేళ ఉత్కంఠ పరిణామాలు
తెలంగాణలో టీఆర్ఎస్ ను దీటుగా ఎదుర్కోవాలనే ఉద్దేశంతో సైద్ధాంతిక విభేదాలు సైతం పక్కనబెట్టి కాంగ్రెస్ తో జతకట్టారు తెలుగుదేశం నేతలు. దీంతో టీఆర్ఎస్ లీడర్లు ప్రచార సభల్లో చంద్రబాబు టార్గెట్ గా ఆరోపణలు ఎక్కుపెడుతున్నారు. అటు చంద్రబాబు టీమ్ కూడా గులాబీ నేతలను ఏకిపారేస్తోంది. దీంతో సహజంగానే ప్రజల్లో ఆసక్తి నెలకొంది. ఇలాంటి నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులు చర్చానీయాంశంగా మారుతున్నాయి. ఏ చిన్న అంశమైనా భూతద్దంలో చూసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాజాగా ఏపీకి చెందిన డీఎస్పీ నాగ దుర్గాప్రసాద్ అరెస్ట్ పర్వం ప్రాధాన్యత సంతరించుకుంది.
అసలు కథ ఇదా?
ఆంధ్రప్రదేశ్ పోలీసాధికారి నాగ దుర్గాప్రసాద్ ను అరెస్ట్ చేయడం ఉత్కంఠ రేపిన క్రమంలో బాచుపల్లి పోలీసులు వివరాలు వెల్లడించారు. భూవివాదం కేసులో ఆయనను అరెస్ట్ చేసినట్లు ధృవీకరించారు. ఏపీలో అసిస్టెంట్ కమాండెంట్ గా పనిచేస్తున్న దుర్గా ప్రసాద్ (డీఎస్పీ) నిజాంపేటలోని ఓ ప్రైవేట్ భూమి వ్యవహారంలో జోక్యం చేసుకోవడంతో కేసు నమోదైంది. తన భార్యగా వేరే మహిళను పేర్కొంటూ ల్యాండ్ విక్రయించిన దుర్గా ప్రసాద్.. ఆమె భర్త పైనా దాడి చేశారనే ఆరోపణలున్నాయి. దీంతో దర్యాప్తు చేపట్టిన బాచుపల్లి పోలీసులు తిరుపతి వెళ్లి ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
అప్పట్లో ఇంటెలిజెన్స్ పోలీసుల కలకలం
కొద్దిరోజుల కిందట ఏపీ ఇంటెలిజెన్స్ పోలీసులు జగిత్యాల జిల్లా ధర్మపురిలో సంచరించడంతో పెద్ద దుమారమే రేగింది. మీడియా పేరుతో తెలంగాణకు వచ్చి ఎన్నికల్లో ఎవరు గెలుస్తున్నారంటూ సర్వే చేశారనేది ప్రధాన ఆరోపణ. స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు అప్పగించడంతో అసలు విషయం వెలుగుచూసింది. ఏపీలో జరిగిన ఎన్ కౌంటర్ల నేపథ్యంలో ఇంటెలిజెన్స్ పోలీసులు ధర్మపురికి వచ్చారే తప్ప వేరే ఉద్దేశం ఏమీలేదంటూ అక్కడి ఉన్నతాధికారులు వెల్లడించారు. దీంతో ఆ వివాదం కాస్తా సద్దుమణిగింది. తాజాగా ఏపీ పోలీసాధికారిని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారంటూ కొన్ని ఛానళ్లలో బ్రేకింగ్ న్యూస్ రావడంతో ఉత్కంఠ నెలకొంది. అయితే భూవివాదం కేసులో ఆయనను అరెస్ట్ చేశారని తెలియడంతో టెన్షన్ వాతావరణానికి బ్రేక్ పడింది.