దసరా పండుగ లక్ష్యంగా టెర్రర్ స్కెచ్: హైదరాబాద్లో భారీ ఉగ్రకుట్ర భగ్నం చేసిన పోలీసులు
భారతదేశంలోని ప్రధాన నగరాలను దాడులతో టార్గెట్ చేయాలని ఉగ్రవాదులు ప్రయత్నం చేస్తున్నారన్న ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం నిజమైంది. హైదరాబాద్ లో మరో ముగ్గురు కుట్ర బయటపడింది. చారిత్రక నగరమైన హైదరాబాద్లో విధ్వంసం సృష్టించడానికి ఉగ్రవాదులు ప్లాన్ చేశారన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్ లో ఉగ్రవాదుల కుట్ర.. దాడులకు మెగా స్కెచ్
పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐఎస్ ఆధ్వర్యంలో నగరంలో ఉగ్రదాడులకు పాల్పడేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నారని గుర్తించిన హైదరాబాద్ పోలీసులు, వారి కుట్రను భగ్నం చేశారు. అక్టోబర్ 2, 2022 ఆదివారం నాడు, ఈ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు హైదరాబాద్లో అరెస్టు చేశారు. అరెస్టయిన నిందితుల నుంచి నాలుగు నాటు బాంబులు, రూ.5,14,800 నగదు, ద్విచక్రవాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నిందితులను కోర్టులో హాజరుపరిచిన పోలీసులు.. జ్యుడీషియల్ రిమాండ్
అరెస్టయిన నిందితులు 39 సంవత్సరాల వయసున్న మలక్ పేట వాసి అబ్దుల్ జాహెద్ , 39 సంవత్సరాల వయసున్న అక్బర్బాగ్ సయీదాబాద్ నివాసి మహ్మద్ సమీయుద్దీన్ అలియాస్ అబ్దుల్ సమీ , 29 సంవత్సరాల వయసున్న మెహదీపట్నంలోని హుమాయునగర్ నివాసి మాజ్ హసన్ ఫరూఖ్ అలియాస్ మాజ్ గా పోలీసులు గుర్తించారు. అబ్దుల్ జాహెద్ మరో ఇద్దరిని ఈ ఉగ్రవాద చర్యలో చేర్చుకున్నాడని వెల్లడించిన పోలీసులు ముగ్గురిని కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు.
గతంలోనూ అనేక ఉగ్రవాద కేసుల్లో నిందితులు
2005లో ఆత్మాహుతి బాంబు కేసులో అబ్దుల్ జాహెద్ను అరెస్టు చేసినప్పటికీ, 12 ఏళ్ల జైలు జీవితం గడిపిన తర్వాత సాక్ష్యాలు లేకపోవడంతో 2017లో అతను విడుదలయ్యాడు. మళ్లీ ఇప్పుడు గ్రెనేడ్లతో సహా అన్ని ఆధారాలతో అరెస్టయ్యాడు. ఇక ఈ కేసులో పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జైలు నుంచి విడుదలైన తర్వాత అబ్దుల్ జాహెద్ తన పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులతో సంబంధాలను పునరుద్ధరించుకున్నాడు. హైదరాబాద్లో ఉగ్రవాద దాడులకు కుట్ర పన్నాడు. అతని ప్రణాళికలో సామాన్య ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేందుకు పేలుళ్లు మరియు ఆకస్మిక దాడులకు పాల్పడాలని ప్లాన్ చేశాడు.
నాలుగు హ్యాండ్ గ్రెనేడ్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు
హైదరాబాద్ పోలీస్ కమిషనర్, సీవీ ఆనంద్ మాట్లాడుతూ, జాహెద్కు నాలుగు హ్యాండ్ గ్రెనేడ్ల సరుకు లభించిందని హైదరాబాద్లో ఉగ్రదాడులు చేయడానికి ప్లాన్ చేశారని నిర్ధిష్ట సమాచారం మేరకు మలక్పేటలో దాడులు నిర్వహించి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. జాహెద్ గతంలో నగరంలో అనేక ఉగ్రవాద సంబంధిత కేసుల్లో ఉన్నాడని, పాకిస్తానీ ఐఎస్ఐఎస్, లష్కరే తోయిబా ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని సివి ఆనంద్ తెలిపారు. వీరు కాక మరో ముగ్గురు పరారీలో ఉన్నారని పేర్కొన్నారు.
మరో ముగ్గురు పరారీలో ... ఉగ్రమూకపై సీపీ సీవీ ఆనంద్ చెప్పిందిదే
పరారీలో ఉన్న ముగ్గురు వ్యక్తులు ఫర్హతుల్లా గౌరీ అలియాస్ ఎఫ్జి, సిద్దిక్ బిన్ ఉస్మాన్ అలియాస్ రఫీక్ అలియాస్ అబు హంజాలా మరియు అబ్దుల్ మజీద్ అలియాస్ ఛోటు అందరూ హైదరాబాద్కు చెందినవారేనని, వీరంతా కూడా అనేక కేసులలో మోస్ట్ వాంటెడ్ గా ఉన్నారని వెల్లడించారు. గతంలో, వారు స్థానిక యువకులను రిక్రూట్ చేసి వారిని వారిని ఉగ్రవాదులుగా మార్చారని, 2002లో దిల్సుఖ్నగర్లోని సాయిబాబా ఆలయం సమీపంలో పేలుడు, ముంబైలోని ఘాట్కోపర్లో బస్సు పేలుడు, 2005లో బేగంపేటలో టాస్క్ఫోర్స్ కార్యాలయంలో పేలుడు వంటి ఉగ్రదాడులను కూడా అమలు చేశారని వెల్లడించారు. 2004లో సికింద్రాబాద్లోని గణేష్ టెంపుల్ సమీపంలో పేలుళ్లకు ప్రయత్నించారని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు
పోలీసుల ముందు ఉగ్ర కుట్ర ఒప్పుకున్న పట్టుబడిన కీలక ఉగ్రవాది
ఫర్హతుల్లా ఘోరీ, అబు హంజాలా మరియు మజీద్లు జాహెద్ తో తమ పరిచయాలను పునరుద్ధరించుకున్నారని, వారు దాడులు చేయడానికి ప్రేరేపించారని, అంతేకాకుండా ఆర్థిక సహాయం చేశారని జాహెద్ పోలీసుల ముందు ఒప్పుకున్నట్టు వెల్లడించారు. పాకిస్తాన్ ఉగ్రవాదుల సూచనమేరకు, జాహెద్ సముద్దీన్ మరియు మాజ్ హసన్లను నియమించుకున్నాడని, సోదాల్లో ముగ్గురి నుంచి నాలుగు గ్రెనేడ్లు స్వాధీనం చేసుకున్నట్టు సివి ఆనంద్ తెలిపారు. బహిరంగ స్థలాలను లక్ష్యంగా చేసుకుని గ్రెనేడ్ విసిరేందుకు ప్లాన్ చేసుకున్నారని వెల్లడించారు.