ఆందోళనలకే పరిమితమైన కాంగ్రెస్ పార్టీ .. ఆ మహిళా ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన
నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన, కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని చెప్పిన ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్ టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఒక హరిప్రియ నాయక్ మాత్రమే కాదు, కాంగ్రెస్ పార్టీలోని పలువురు ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ బాట పట్టారు. సీనియర్ నాయకురాలు అయిన సబితా ఇంద్రా రెడ్డి సైతం గులాబీ గూటికి చేరేందుకు రెడీ అయ్యారు . ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఆరుగురు టీఆర్ఎస్ పంచన చేరుతుంటే చేష్టలుడిగి చూస్తుంది కాంగ్రెస్ పార్టీ.
ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఆపలేని పరిస్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏయే నియోజకవర్గాల ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారో ఆయా నియోజకవర్గాల్లో ఆందోళనలకు పిలుపునిచ్చింది.
నెల రోజుల్లో ఐదుగురు ఔట్: దేనికైనా రెడీ.. హరిప్రియ, సబిత నో... జానా సహా అందరూ ఆశ్చర్యం
ఇక ఈ నేపథ్యంలోనే ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ టిఆర్ఎస్ పార్టీలోచేరినందుకు నిరసనగా కామేపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏపూరి మహేందర్, అంతోటి అచ్చయ్య ఆధ్వర్యంలో ఆమె దిష్టిబొమ్మను దహనం చేశారు. కొత్తలింగాల గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట హరిప్రియ దిష్టిబొమ్మను దహనం చేసి.. నాయకులు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ... హరిప్రియ వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీ బీపారమ్పై పోటీ చేసి గెలవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచి ఇలా పార్టీ ఫిరాయించడం కరెక్ట్ కాదని వారన్నారు.టిఆర్ఎస్ పార్టీ ప్రలోభాలకు గురిచేసి తమ పార్టీ ఎమ్మెల్యేలను టిఆర్ఎస్ పార్టీలో చేర్చుకుంటున్నారని వారు ఆరోపించారు.