చేనేత కార్మికుడి కుటుంబంపై గులాబీ నాయకుల జులుం .. తమను కాపాడాలని వీడియోలో విన్నపం
చేనేత పని చేసుకుని పొట్ట పోసుకుందామనుకున్న ఒక కుటుంబానికి కష్టం వచ్చి పడింది. పొట్ట చేత పట్టుకొని మహారాష్ట్రంలోని భీమండికి వలస వెళ్లిన ఓ కుటుంబం తిరిగి తమ స్వగ్రామమైన పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం గ్రామానికి తిరిగి వచ్చారు. తెలంగాణ ప్రభుత్వం చేనేత వృత్తిని ఆదుకుంటుంది అన్న భరోసాతో స్వగ్రామంలోనే కుల వృత్తిని ప్రారంభించారు. అయితే వారికి టిఆర్ఎస్ నాయకులు పేరుతో బెదిరింపులు మొదలయ్యాయి.

మగ్గాలు నడపటానికి వీల్లేదని బెదిరిస్తున్న టీఆర్ఎస్ నాయకులు .. చేనేత కార్మికుడికి ఇబ్బందులు
చేనేత పని చేయ రాదని, ఊరు వదిలి వెళ్లాలంటూ స్థానిక టిఆర్ఎస్ నాయకుల పేరుతో బెదిరింపులకు పాల్పడుతుంటే విధిలేని పరిస్థితిలో ఆ చేనేత కార్మికుని కుమారుడు తమను కాపాడాలంటూ వీడియో లో విజ్ఞప్తి చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతుంది.
తిరుపతి అనే చేనేత కార్మికుడు కుటుంబాన్ని విడిచిపెట్టి పొట్ట చేత పట్టుకుని 20 సంవత్సరాలుగా మహారాష్ట్రలో చేనేత పనిచేసి జీవనం సాగిస్తున్నాడు. అయితే తెలంగాణ ప్రభుత్వం చేనేత కార్మికులకు అండగా నిలబడుతుంది అన్న భరోసాతో తిరిగి తన స్వగ్రామానికి వచ్చిన తిరుపతి కి చేదు అనుభవం ఎదురైంది. ఆరు లక్షల అప్పు చేసి మగ్గాలను పెట్టుకొని చేనేత వృత్తి కొనసాగించాలనుకున్న తిరుపతిని గ్రామంలోని కొందరు టిఆర్ఎస్ నాయకులు ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
మానసికంగా వేధిస్తున్నారని ఆవేదన .. వీడియో లో తమను కాపాడాలని విన్నపం
దీంతో తిరుపతి కుటుంబం మానసిక క్షోభను అనుభవిస్తుంది. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం కావడంతో తమ వృత్తిని కొనసాగించకుండా అడ్డుకుంటున్న నేపథ్యంలో తిరుపతి కుటుంబం ఆవేదనకు లోనవుతుంది. తమకు మగ్గాలపై పని చేసేందుకు అన్ని రకాల అనుమతులు ఉన్నప్పటికీ స్థానిక టిఆర్ఎస్ నాయకులు ఇబ్బంది పెడుతున్నారంటూ తిరుపతి కుమారుడు వీడియోలో ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
తమ వృత్తి తాము కొనసాగించుకునేలా అధికారులు చొరవ చూపాలని, ఇక టిఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం దృష్టికి తమ సమస్య వెళ్లాలని తిరుపతి కుమారుడు వీడియో లో తన ఆవేదన వెళ్లగక్కాడు.

కేసీఆర్ చేనేత కార్మికులకు అండగా ఉండమంటే వేధిస్తున్న గులాబీ నాయకులు
చేనేత వృత్తి చేసుకోనీయకుంటే తమకు ఆత్మహత్యే శరణ్యమంటూ తిరుపతి పేర్కొన్నాడు. ఇక తమ కుటుంబాన్ని వేధిస్తున్న టిఆర్ఎస్ నాయకులు తమని చంపుతామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఎలాగైనా తమను వారి బారి నుండి కాపాడాలని కోరుతున్నారు. టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ కులవృత్తులను ఆదుకుంటామని చెప్తుంటే, టిఆర్ఎస్ నాయకులు మాత్రం తమ స్వప్రయోజనాల కోసం అధినేత ఆదర్శాలను తుంగలో తొక్కి చాలాచోట్ల బలహీనులపై జులుం ప్రదర్శిస్తున్నారు.












Click it and Unblock the Notifications