Mahesh Kumar Goud: హైదరాబాద్ భవిష్యత్ కోసమే ఇదంతా.. హైడ్రాపై మహేశ్ కుమార్ గౌడ్..!
హైడ్రా రాకతో హైదరాబాద్ లోని అక్రమార్కులు భయపడి పోతున్నారు. ఇప్పటికే హైడ్రా పలు అక్రమ కట్టడాలను కూల్చివేసింది. అయితే హైడ్రాపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. హైడ్రా రాక్షసుడు కాదని.. రక్ష అని అన్నారు. కాగా తాజాగా రాష్ట్ర ప్రభుత్వం మూసీ ప్రక్షాళనకు నడుము బిగించింది. మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న నిర్మాణాలను తొలగించనున్నారు. బాధితులకు డబుల్ బెడ్ ఇళ్లు కేటాయించనున్నారు. తాజాగా హైడ్రా, మూసీ ప్రక్షాళనపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు.
వరదల నివారణకే మూసీ ప్రక్షాళన చేపట్టామని వివరించారు. భారీ వర్షం కురిస్తే హైదరాబాద్ లో ఎక్కడ బడితే అక్కడ నీరు నిలిచిపోతుందని.. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు. అందుకే మూసీ ప్రక్షాళన చేపట్టినట్లు పేర్కొన్నారు. తాము ఏం చేసినా హైదరాబాద్ భవిష్యత్ కోసమే చేస్తామని తెలిపారు. హైదరాబాద్ కు వయోనాడ్ దుస్థితి తలేత్తవద్దన్నారు. వరదలు వస్తే హైదరాబాద్ ఎలా ఉంటుందో ఊహించుకోవడమే భయంగా ఉందన్నారు. మూసీ ప్రక్షాళన బీఆర్ఎస్ మేనిఫేస్టో ఉందో లేదా చెప్పాలని డిమాండ్ చేశారు.

గ్లోబల్ వార్మింగ్ గురించి బీఆర్ఎస్ నేతలకు అవగాహన లేదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ ఆస్తులను కబ్జా చేస్తే ఊరుకునేది లేదన్నారు. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకే హైడ్రా ఉందన్నారు. మూసీలో ఇప్పటి వరకు పేదల గుడిసెలు ఒక్కటి కూడా కూల్చలేదని మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. మూసీని ప్రక్షాళన చేస్తేనే బాగుంటుందన్నారు. ఆక్రమణలను తొలగిస్తేనే హైదరాబాద్ కు భద్రత ఉంటుందని వివరించారు. పేదవాడిని అన్ని రకాలుగా ఆదుకుంటామని పేర్కొన్నారు. పేదోడిని ఆదుకునే పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని తెలిపారు.
హైదరాబాద్ భవిష్యత్ ను ఆలోచించి.. దీర్ఘకాలిఖ ఆలోచనలతో ముందుకు వెళ్తున్నామని వివరించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి 90 శాతం మంది మద్దతు ఉందని గుర్తు చేశారు. ఫామ్ హౌస్ అభివృద్ధి చెందితే హైదరాబాద్ అభివృద్ధి చెందినట్లు కాదన్నారు. హైడ్రాపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేయవద్దని కోరారు.












Click it and Unblock the Notifications