వెంటిలేటర్పై కేసీఆర్ సర్కార్ - కదులుతున్న పావులు..!!
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని టీఆర్ఎస్ ప్రభుత్వంపై భారతీయ జనత పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్.. మరోసారి ఘాటు విమర్శలు సంధించారు. కేసీఆర్ సర్కార్ త్వరలో కుప్పకూలిపోబోతోందని జోస్యం చెప్పారు. ఎంతో కాలం మనుగడ సాగించలేదని హెచ్చరించారు. సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కొనసాగిస్తోన్న దాడులను ఆయన పరోక్షంగా ప్రస్తావనకు తీసుకొచ్చారు. సమస్యలను పరిష్కరించే బాధ్యతను తాము తీసుకోబోతోన్నామని స్పష్టం చేశారు.

డంపింగ్ యార్డ్ సమస్య..
మేడ్చల్ నియోజకవర్గంలో బండి సంజయ్ పాదయాత్రను నిర్వహించారు. దమ్మాయిగూడ వరకు ఆయన పాదయాత్ర సాగింది. అనంతరం దమ్మాయిగూడలో నిర్వహించిన బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వెంటిలేటర్పై ఉందని, త్వరలో కూలిపోతుందని అన్నారు. దమ్మాయిగూడ డంపింగ్యార్డు వల్ల ప్రజలు తీవ్ర అనారోగ్యం బారిన పడుతున్నారని, ప్రజలపై ఏ మాత్రం ప్రేమాభిమానాలు ఉన్నా కేసీఆర్ వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

కలెక్టర్లు, ఎస్పీలపై
లేదంటే ఈ సమస్యను పరిష్కరించే బాధ్యతను తాము తీసుకుంటామని బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ను రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్గా కీర్తిస్తోన్న కొందరు కలెక్టర్లు, పోలీసు అధికారులు సిగ్గుపడాలని చెప్పారు. రాజ్యాంగాన్ని అవమానించే వ్యక్తిని అంబేద్కర్గా పోల్చుతున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్.. ఆయన కుటుంబ సభ్యులు మేడ్చల్ ఆర్టీసీ డిపోను తాకట్టు పెట్టి షాపింగ్ మాల్స్ నిర్మిస్తున్నారని, ప్రజాధనాన్ని లూటీ చేస్తోన్నారని ఆరోపించారు.

సీబీఐ, ఈడీ అంటే..
కేసీఆర్ కుటుంబానికి ఈడీ, సీబీఐ అంటే భయం అని విమర్శించారు. సీబీఐ అధికారులు దాడులు చేయడానికి వస్తే కోవిడ్ వచ్చిందని, ఈడీ విచారణకు వస్తే కాలు నొప్పులంటూ తప్పించుకుంటుందని ధ్వమెత్తారు. బోడుప్పల్లో 7,000 ఫ్లాట్లకు రిజిస్ట్రేషన్ లేదని, ఈ ప్రాంతంలో 100 పడకల ఆసుపత్రి, డిగ్రీ కాలేజీ కట్టలేదు గానీ.. పెద్ద ఎత్తున భూకబ్జాలు జరుగుతున్నాయని బండి సంజయ్ విమర్శించారు.

నిధులు దారి మళ్లింపు..
కేంద్ర ప్రభుత్వ నిధులను టీఆర్ఎస్ ప్రభుత్వం దారి మళ్లిస్తోందని, కమీషన్ల కోసం ట్రాక్టర్లను కొనుగోలు చేస్తోందని ఆరోపించారు.వందల కోట్ల ఆస్తులను కేసీఆర్ కుటుంబ సభ్యులు సంపాదిస్తున్నారని అన్నారు. కేసీఆర్ దళిత బంధు కాదని, దళిత ద్రోహిగా ఆభివర్ణించారు. దళితులకు కేసీఆర్ చేసిందేమీ లేదని చెప్పారు. మాఫియాలకు టీఆర్ఎస్ కేంద్ర బిందువు అయిందని, మేడ్చల్ నియోజకవర్గంలో ఎంత మంది పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇచ్చారని ప్రశ్నించారు.

మునుగోడు కోసమే..
మేడ్చల్లో ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారు.. నిరుద్యోగ భృతిని మంజూరు చేశారంటూ నిలదీశారు బండి సంజయ్. దళితులకు మూడు ఎకరాలు ఎందుకు ఇవ్వడం లేదంటూ ప్రశ్నించారు. మునుగోడు ఉప ఎన్నిక ఉన్నందునే కేసీఆర్ ఇప్పుడు ఎస్టీ రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్నారని ఆరోపించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో ఎస్టీ ఓట్లు ఎక్కువగా ఉన్నాయని, అందుకే రిజర్వేషన్ అంశాన్ని తెరమీదికి తెచ్చాడని అన్నారు. ఎనిమిది సంవత్సరాలుగా ఏళ్లుగా ఎస్టీలకు ఎందుకు రిజర్వేషన్లు ఇవ్వలేదో కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications