తెలంగాణ అసెంబ్లీలో టీఆర్ఎస్ పేరు బీఆర్ఎస్గా మార్పు: ఇక బీఆర్ఎస్ఎల్పీ
హైదరాబాద్: భారత్ రాష్ట్ర సమితిగా టీఆర్ఎస్ పేరు మారిన నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ, శాసనమండలిలోనూ పార్టీ పక్షం పేర్లు అధికారికంగా మారాయి. ఇక నుంచి భారత రాష్ట్ర సమితి శాసనసభాపక్షం(బీఆర్ఎస్ ఎల్పీ)గా వ్యవహరించనున్నారు. పార్టీ పేరు మారిన క్రమంలో శాసనసభ, మండలి రికార్డుల్లోనూ పేరు మార్చాలని టీఆర్ఎస్ శాసనసభాపక్ష నేత.. కౌన్సిల్ ఛైర్మన్, అసెంబ్లీ స్పీకర్ కు లేఖ రాశారు.
పార్టీ పేరు మారుస్తూ కేంద్ర ఎన్నికల సంఘం రాసిన లేఖను పరిగణలోకి తీసుకోవాలని కోరారు. ఆ విజ్ఞప్తికి అనుగుణంగా టీఆర్ఎస్ శాసనసభా పక్షం పేరును బీఆర్ఎస్ శాసనసభా పక్షంగా మారుస్తూ మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.
ఇందుకు అనుగుణంగా రికార్డుల్లో మార్పులు చేయాలని అధికారులను ఆదేశించారు. పేరు మార్పునకు సంబంధించి అసెంబ్లీ కార్యదర్శి బులెటిన్ జారీ చేశారు. దాదాపు తొమ్మిదేళ్లుగా తెలంగాణను ఏలుతున్న తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) ఇటీవల జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు పార్టీ పేరును మార్చుకున్న విషయం తెలిసిందే.
ఇటీవల సీఎం కేసీఆర్ భారత్ రాష్ట్ర సమితి ప్రధాన కార్యాలయాన్ని దేశ రాజధానిలో ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇక వచ్చే అన్ని ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ పేరుతోనే ప్రజల్లోకి వెళ్లనుంది. తెలంగాణతోపాటు మరో ఆరు రాష్ట్రాల్లో మొదటగా శాఖలను ఏర్పాటు చేసి.. అక్కడి ఎన్నికల్లో పోటీ చేసేందుకు కసరత్తులు చేస్తోంది. బీఆర్ఎస్ విస్తరణ కోసం ఏపీ, తెలంగాణలో ఇప్పటికే కసరత్తులు ప్రారంభించారు.