ఎమ్మెల్సీ ఎన్నికల వేళ 'గులాబీ ఆకర్ష్'.. కారులోకి టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు..!
హైదరాబాద్ : ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో సెంచరీ కొడతామన్నారు టీఆర్ఎస్ బాస్ కేసీఆర్. అయితే 88 స్థానాలతో బంపర్ మెజార్టీ సాధించారు. ఎన్నికల పర్వం మొదలుకాకముందు నుంచే వంద స్థానాల్లో పాగా వేస్తామన్న కేసీఆర్.. అందుకనుగుణంగానే వంద సంఖ్యను ఫుల్ ఫిల్ చేసేలా పావులు కదుపుతున్నారు. అసెంబ్లీ ఫలితాలొచ్చిన మొదట్లోనే ఇద్దరు ఎమ్మెల్యేలు గులాబీ తీర్థం పుచ్చుకోవడంతో అసెంబ్లీలో కారు స్పీడ్ 90కి చేరింది. తాజాగా గులాబీ ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా టీడీపీకి చెందిన ఒక ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కారెక్కేందుకు సన్నద్ధమవుతున్నారు. వీరు ముగ్గురు కలిస్తే శాసనసభలో టీఆర్ఎస్ బలం 93కు చేరుకుంటుంది. నామినేటెడ్ ఎమ్మెల్యేను కలిపితే 94 అవుతుంది.
ఆపరేషన్ ఆకర్ష్.. క్లీన్ స్వీప్?
తెలంగాణ ఉద్యమ నేపథ్యం మొదలు టీఆర్ఎస్ పార్టీ పక్కా ప్లాన్ తో ముందుకెళుతోంది. ఆనాటి నుంచి నేటి దాకా గులాబీ ఆపరేషన్ ఆకర్ష్ విజయవంతంగా అమలవుతోంది. 2014లోనూ ఇతర పార్టీల నేతలను గులాబీవనానికి రప్పించడంలో సఫలీకృతులయ్యారు టీఆర్ఎస్ లీడర్లు. తాజాగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలోనూ మరోసారి ఆపరేషన్ ఆకర్ష్ కు తెరతీసినట్లైంది. ఎమ్మెల్యే కోటా కింద 5 ఎమ్మెల్సీ స్థానాలను క్లీన్ స్వీప్ చేయడానికి సిద్ధమైంది టీఆర్ఎస్. కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ దాఖలైంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి గండికొట్టేలా టీఆర్ఎస్ పదునైన వ్యూహాలు సిద్ధం చేసింది.
అక్కడ సీన్ కట్ చేస్తే.. ఉమ్మడి ఖమ్మం జిల్లా "సత్తుపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి టీడీపీ తరపున గెలిచిన సండ్ర వెంకటవీరయ్య" శనివారం సీఎం కేసీఆర్ ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన కారెక్కేందుకు రెడీగా ఉన్నారట. త్వరలో జరగనున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు జై కొట్టడానికి ఊ కొట్టారట. సండ్ర అలా కేసీఆర్ ను కలిసి వెళ్లారో లేదో.. కాసేపటికే మరో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గులాబీ తీర్థం పుచ్చుకోవడానికి రెడీగా ఉన్నట్లు ప్రకటించారు.
కాంగ్రెస్ -2.. ఆ ఇద్దరిదీ ఇక కారు జర్నీ
ఉమ్మడి ఖమ్మం జిల్లా "పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావు" తో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా "ఆసిఫాబాద్ కు చెందిన ఆత్రం సక్కు".. మొన్నటి ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ పై పోటీచేసి గెలుపొందారు. టీఆర్ఎస్ హవా ఉన్నప్పటికీ వీరిద్దరు సునాయాసంగా విజయం సాధించారు. అయితే గిరిపుత్రులు, ఆదివాసీల సమస్యలు సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే పరిష్కారం అవుతాయంటూ గులాబీవనంలోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. హస్తానికి హ్యాండిచ్చి కారెక్కేందుకు రెడీ అయ్యారు. అంతేకాదు అవసరమైతే శాసనసభ సభ్యత్వాలకు రాజీనామా చేసి, టీఆర్ఎస్ తరపున పోటీచేస్తామని సంయుక్త ప్రకటనలో తెలిపారు.
ఇటీవల సీఎం కేసీఆర్ ను కలిసిన సందర్భంలో.. గిరిజన, ఆదీవాసీల సమస్యలకు పరిష్కారం చూపుతామని స్పష్టమైన హామీ ఇవ్వడంతో టీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు. పోడు భూముల సమస్య, ఆదీవాసీల ప్రాంతాల్లో రహదారులు, విద్య, ఉద్యోగం, వైద్యం, ఉపాధి.. ఇలా అనేక రకమైన హామీలపై కేసీఆర్ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. అందుకే అధికార పార్టీ టీఆర్ఎస్ లో చేరితే అభివృద్ధి జరుగుతుందనే ఆశ ఉందని పేర్కొన్నారు.
అసెంబ్లీలో గులాబీ బలమెంత?
శాసనసభలో టీఆర్ఎస్ పార్టీ సంఖ్యా బలం 88. ఫలితాలు వచ్చిన వెంటనే అఖిలభారత ఫార్వర్డ్బ్లాక్ పార్టీ తరపున రామగుండం నుంచి గెలిచిన ఎమ్మెల్యే చందర్ తో పాటు వైరా సెగ్మెంట్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించిన లావుడ్యా రాములు గులాబీ తీర్థం పుచ్చుకోవడంతో 90 కి చేరింది. తాజాగా సండ్ర వెంకట వీరయ్య, రేగ కాంతారావు, ఆత్రం సక్కు చేరుతుండటంతో.. గులాబీ బలం కాస్తా 93 కు చేరుతుంది. ఇక నామినేటెడ్ ఎమ్మెల్యేను కలిపితే ఆ సంఖ్య 94 కు చేరుతుంది. అటు మజ్లిస్ సభ్యుల బలం (7) పరిగణనలోకి తీసుకుంటే 101 అవుతుంది.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచిన ఒక్కో అభ్యర్థి మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిచేందుకు 21 ఓట్లు అవసరమవుతాయి. మొత్తం 5 ఎమ్మెల్సీ స్థానాలు క్లీన్ స్వీప్ చేయాలంటే 105 మంది ఎమ్మెల్యేలు అవసరమవుతారు. పైన లెక్కలు చూసినట్లయితే.. 101 మంది సంఖ్యాబలం టీఆర్ఎస్ కు ఉంది. అయితే మరో నలుగురి మద్దతు దొరికితే 5 ఎమ్మెల్సీ స్థానాలు కారు ఖాతాలో పడ్డట్లే. ఎమ్మెల్సీ ఎన్నికలకు మరికొంత సమయం ఉండటంతో.. అప్పటివరకు మరికొంతమందిని కారెక్కించే ప్రయత్నం జరుగుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ కు ఇప్పటివరకు 19 మంది సభ్యుల బలముంది. ఇద్దరు ఎమ్మెల్యేలు గులాబీవనం వైపు చూడటంతో ఆ పార్టీ సంఖ్యాబలం 17కు పడిపోనుంది.