టీఆర్ఎస్ ఓటమి ఖాయం: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చేలా ఉంది. అంటే నేతల మాటలు.. పర్యటనలు అలా అనిపిస్తున్నాయి. సీఎం కేసీఆర్ దూకుడు పెంచగా.. బీజేపీ, కాంగ్రెస్ నేతలు కూడా అలానే కౌంటర్ అటాక్ చేస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే ఏకంగా ముందస్తు ఎన్నికలు వస్తాయని మరీ కామెంట్ చేశారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా ఎన్నికల గురించి కామెంట్ చేశారు.
టీఆర్ఎస్ అధినాయకత్వంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఓటమి నుంచి కేసీఆర్ను ఎవరూ కాపాడలేరని అన్నారు. కేసీఆర్ తాటాకు చప్పుళ్లకు బీజేపీ భయపడదని స్పష్టం చేశారు. కొత్త రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం మాత్రమే బంగారం అయ్యిందని కామెంట్ చేశారు. అన్ని వర్గాలను మోసం చేయడమే కేసీఆర్ తెచ్చిన మార్పు అని కిషన్ రెడ్డి విమర్శించారు. బీజేపీపై కక్షగట్టిన కుటుంబ పార్టీలకు బుద్ధి చెబుతామని అన్నారు.
వరిధాన్యం కొనేది కేంద్రం ప్రభుత్వమేనని రైతులకు అర్థమైందని వెల్లడించారు. టీఆర్ఎస్ నేతలు తప్పుడు మాటలను జనం నమ్మలేదని చెప్పారు. అలాగే పొదుపు సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆరోపించారు. ప్రభుత్వం చేసిన, చేస్తోన్న పనులను జనం గమనిస్తున్నారని.. తగిన సమయంలో బుద్ది చెబుతారని కామెంట్ చేశారు.
ముందస్తు ఎన్నికల గురించి బీజేపీ ఎలాంటి కామెంట్ చేయలేదు. కానీ అధికార పార్టీ దూకుడుకు మాత్రం కళ్లెం వేస్తోంది. అంటే మాటకు మాట సమాధానం చెబుతుంది. ఇదివరకు కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లిన సంగతి తెలిసిందే. 6 నెలల సమయం ఉండగానే అసెంబ్లీని రద్దు చేసి వెళ్లారు. ఇప్పుడు కూడా అలానే వెళ్లే ఛాన్స్ ఉంది. అందుకోసమే వేగంగా పర్యటనలు చేస్తున్నారు. జనంతో కలిసిపోతున్నారు.