ఇద్దరికీ కన్ఫామ్.. మూడో సీటుపై పీఠముడి.. ప్రకాశ్ రాజ్ లేదంటే మోత్కుపల్లి
తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థులపై స్పష్టత వచ్చింది. మొత్తం మూడు స్థానాల్లో.. ఇద్దరు అభ్యర్థులు ఖాయం అయ్యారు. మరో అభ్యర్థిని ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. రాజ్యసభ సీట్ల భర్తీ సమయంలో టీఆర్ఎస్లో ఇద్దరి పేర్లు చివరి నిమిషం వరకు వినిపించాయి. అప్పుడు వారికి అవకాశం దక్కలేదు. ఈసారి ఆ ఇద్దరినీ పెద్దల సభకు పంపించేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయించినట్టు సమచారం.
వెన్ను దన్నుగా..
ఉద్యమ సమయం నుంచి టీఆర్ఎస్ కోశాధికారిగా వ్యవహరించిన దామోదర్రావు, పారిశ్రామికవేత్త-హెటిరో సంస్థ అధినేత పార్ధసారథిరెడ్డికి రాజ్యసభ టికెట్లు ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. అధికారికంగా ప్రకటించడమే ఆలస్యం అనే చర్చ జరుగుతుంది. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డిని పంపిస్తారనే ప్రచారం జరిగింది. కేటీఆర్తో పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సమావేశమై ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనే అవకాశం ఇవ్వాలని కోరారట. కేటీఆర్ కూడా ఓకే చెప్పడంతో పెద్దల సభకు పొంగులేటి వెళ్లనట్లే అని స్పష్టం అవుతోంది. అదే సామాజికవర్గం, అదే జిల్లాకే చెందిన పారిశ్రామికవేత్త పార్ధసారథిరెడ్డికి లైన్ క్లియర్ అయ్యింది.
అగ్రవర్ణాలకే..
రెండు సీట్లు అగ్రవర్ణాలకే దక్కుతాయనే ప్రచారం జరుగుతోంది. మూడో సీటును బీసీ లేదా ఎస్సీ నేతలకు కేటాయించే అవకాశం ఉంది. బీసీ సామాజికవర్గంలో నారదాసు లక్ష్మణ్రావు, పిఎల్ శ్రీనివాస్ పేర్లు వినిపిస్తున్నాయి. కేసీఆర్తో సన్నిహితంగా మెలుగుతున్న ప్రకాశ్ రాజ్కు అవకాశం ఉండే ఛాన్స్ ఉంది. ఎస్సీ సామాజికవర్గానికి చెందిన మోత్కుపల్లి నర్సింహులు కూడా రేస్లో ఉన్నారు. జాతీయ రాజకీయాలపై దృష్టిసారించిన కేసీఆర్.. బీజేపీ టార్గెట్గా పార్టీ వాయిస్ గట్టిగా వినిపించేందుకు పావులు కదుపుతున్నారు. ప్రకాశ్రాజ్కు లైన్ క్లియర్ చేస్తారని సమాచారం.
ప్రకాశ్ రాజ్.. లేదంటే మోత్కుపల్లి
రెండేళ్ల పదవీకాలం ఉండే రాజ్యసభ సీటును ప్రకాశ్రాజ్ ద్వారా భర్తీ చేసే ఛాన్స్ ఉందనే చర్చ కూడా టీఆర్ఎస్లో వినిపిస్తోంది. మూడు రాజ్యసభ స్థానాలకు ఒకే సారి అభ్యర్థులను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉంది. దాదాపు రెండు స్థానాలకు అభ్యర్థులపై స్పష్టత రావడంతో మరో స్థానం ఎవరికి దక్కనుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.