ఉత్కంఠకు తెరదించిన కేసీఆర్: టీఆర్ఎస్ రాజ్య సభ అభ్యర్థులు వీరే
తెలంగాణా సీఎం గులాబీ బాస్ ఎట్టకేలకు ఉత్కంఠ కు తెర దింపారు . రాజ్యసభకు టీఆర్ఎస్ అభ్యర్థుల పేర్లు ఖరారు చేశారు . తెలంగాణలో టీఆర్ఎస్ నుంచి రాజ్యసభకు వెళ్లేదెవరు అనేదానిపై తీవ్ర ఉత్కంఠ నడిచింది. గత ఎన్నికల్లో ఓటమి పాలైన , మాజీ మంత్రులు , కీలక నాయకులు ఆశావహుల రేసులో ఉన్నారు. రోజుకో పేరు తెరపైకి వచ్చిన ఆశావహుల్లో టెన్షన్ పెరిగింది.ఇక సీఎం కేసీఆర్ తనయ కవిత పేరు కూడా రాజ్య సభ అభ్యర్థిగా వినిపించింది . కానీ సీఎం కేసీఆర్ మనసులో ఏముంది..? ఎవరెవరి పేర్లను ఫైనల్ చేశారు అంటే ..
కే.కేశవరావు, సురేష్ రెడ్డి పేర్లను ఫైనల్ చేసిన సీఎం కేసీఆర్
కే.కేశవరావు, సురేష్ రెడ్డి పేర్లను సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా కొనసాగుతున్న కే.కేశవరావుకు మరోసారి అవకాశం ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. కేశవరావుకు అవకాశం ఇస్తారా, లేదా అన్న తర్జన భర్జన కొనసాగిన వేళ ఎట్టకేలకు ఆయనకు మరోసారి అవకాశం ఇచ్చారు. ఇక కాంగ్రెస్ నుండి టీఆర్ఎస్ లోకి వచ్చిన సురేష్ రెడ్డికి అన్ని పార్టీలలో , అన్ని భాషల మీద పట్టు ఉంది. అంతే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు స్పీకర్ గా పని చేసిన అనుభవం, వివాద రహితుడు కావటంతో ఆయన పార్టీ కోసం జాతీయ రాజకీయాల్లో కీలకంగా పని చేస్తారని భావించారు . అందుకే ఆయన పేరు ఖరారు చేశారు గులాబీ బాస్ .
రేపు నామినేషన్ల దాఖలు
తెలంగాణలో ఖాళీ అయిన 2 స్థానాలకు ఫైనల్ గా అభ్యర్థులను ప్రకటించారు కేసీఆర్. చాలా రోజులపాటు కొనసాగిన ఉత్కంఠ మధ్య నామినేషన్లు దాఖలు చేయడానికి మార్చి 13 చివరి తేదీ కావటంతో నేడు అభ్యర్థులను ప్రకటించారు. దీంతో శుక్రవారం ఉదయం 11 గంటలకు కేకే, సురేష్ రెడ్డి లు నామినేషన్ దాఖలు చేయనున్నారు. టీఆర్ఎస్ నుంచి పెద్దల సభకు వెళ్లాలని అనుకున్న ఆశావహుల లిస్ట్ లో చాలామందే ఉన్నా రెండే స్థానాలు ఖాళీ కావటంతో సీఎం కేసీఆర్ ఆ రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.
Recommended Video
మిస్టర్ కూల్ సురేష్ రెడ్డికి అవకాశం ఇచ్చిన గులాబీబాస్
ఇక నిజామాబాద్ నుండి గత ఎన్నికల సమయంలో పార్టీ మారి పార్టీ కోసం కీలకంగా పని చేసిన సురేష్ రెడ్డికి అప్పట్లో సీఎం కేసీఆర్ గౌరవ ప్రదమైన స్థానం ఇస్తామని హామీ ఇచ్చారు. ఆయనకు ఎమ్మెల్సీ గా అవకాశం ఇస్తారేమో అని అంతా భావించారు కానీ ఆయనకు రాజ్యసభ అభ్యర్థిగా అవకాశం కల్పించారు సీఎం కేసీఆర్ .
ఇక ఆశావహుల జాబితాలో ఉన్న ఖమ్మం జిల్లా నాయకులైన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి , పారిశ్రామికవేత్త పార్ధసారధి రెడ్డి, టీఎస్ఐఐసీ చైర్మన్ బాలమల్లు కు సీఎం షాక్ ఇచ్చారు. మాజీ మంత్రులు, గత ఎన్నికల్లో ఓటమి పాలైన నాయకులకు కూడా స్థానం లేదని తేల్చేశారు. ఒక స్థానం మరోమారు కేశవరావుకు , ఇంకో స్థానంలో మిస్టర్ కూల్ గా పేరున్న సురేష్ రెడ్డి కి సీఎం కేసీఆర్ అవకాశమిచ్చారు. మొత్తానికి ఎవరికి అవకాశం ఇస్తారు అన్న టెన్షన్ కు చెక్ పెట్టి పేర్లను ప్రకటించేశారు సీఎం కేసీఆర్.