అసదుద్దీన్కు హైకోర్టు షాక్: చార్మినార్ వద్ద ఎంఐఎం ర్యాలీకి నో.. సభకు మాత్రమే అనుమతి
సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్కు వ్యతిరేకంగా ఎంఐఎం చార్మినార్ వద్ద తలపెట్టిన నిరసన ర్యాలీకి హైకోర్టు అనుమతి నిరాకరించింది. అయితే బహిరంగ సభకు మాత్రమే పర్మిషన్ ఇస్తామని కోర్టు శనివారం వెల్లడించింది. శనివారం అర్ధరాత్రి(తెల్లవారితే రిపబ్లిక్ డే) చార్మినార్ వద్ద జాతీయ జెండాలతో భారీ నిరసన ర్యాలీ, బహిరంగ సభకు చేపడతామన్న ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ.. ఈ మేరకు పోలీసుల నుంచి అనుమతి కూడా పొందారు. దీనిని బీజేపీ వ్యతిరేకిస్తుండగా, పోలీసుల నిర్ణయాన్ని సవాలు చేస్తూ మహేంద్ర అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు.

షరతులు వర్తిస్తాయి..
ఎంఐఎం సభపై దాఖలైన పిటిషన్ ను శుక్రవారం విచారించిన హైకోర్టు.. హైదరాబాద్ నగరంలో ఎలాంటి ర్యాలీలూ చేపట్టరాదని ఆదేశించింది. బహిరంగ సభకు కూడా షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. శనివారం అర్ధరాత్రి చార్మినార్ వద్ద జాతీయ జెండా ఎగరేస్తామన్న అసద్ పార్టీ వాదనను కోర్టు తోసిపుచ్చింది. సాయంత్రం 6 గంటల నుంచి 11 గంటలలోపే సభ నిర్వహించుకోవాలని స్పష్టం చేసింది.

వీడియోగ్రఫీకీ ఆదేశం..
చార్మినార్ వద్ద శనివారం సాయంత్రం జరుగనున్న ఎంఐఎం సభను మొత్తం వీడియోగ్రఫీ చేసి, ఆ రికార్డుల్ని హైకోర్టుకు అందించాలంటూ రాష్ట్ర డీజీపీని హైకోర్టు ఆదేశించింది. అల్లర్లు చోటుచేసుకోకుండా తగిన భత్రతా ఏర్పాట్లు చేయాలని, ఎవరైనా శాంతిభద్రతకు విఘాతం కలిగిస్తే వెంటనే కేసులు నమోదు చేయాలని సూచించింది.

చిచ్చు రేపేందుకు ఎంఐఎం ప్లాన్..
జాతీయ జెండాలతో మత విద్వేషాలు సృష్టించేందుకే ఎంఐఎం ర్యాలీ, సభ నిర్వహిస్తోందని, ఎట్టిపరిస్థితుల్లోనూ దానికి అనుమతివ్వొద్దని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ఆధ్వర్యంలోని బృందం హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ను రిక్వెస్ట్ చేసింది. అయినప్పటికీ పోలీసులు అనుమతించడంతో మహేంద్ర అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. ఇటీవల భైంసాలో జరిగిన ఉద్రిక్తతలను కోర్టులో ప్రస్తావించిన పిటిషనర్.. రిపబ్లిక్ డే ముందు రోజు ఎంఐఎం తలపెట్టిన నిరసనల్లోనూ ఘర్షణలు తలెత్తే అవకాశం ఉందని వాదించారు. రెండు వైపుల వాదనలు విన్న కోర్టు.. చివరికి సభకు మాత్రమే అనుమతిచ్చి, ర్యాలీలు చేపట్టొద్దని తీర్పు చెప్పింది.












Click it and Unblock the Notifications