దసరాకు స్పెషల్ బస్సులు: 24వ తేదీ నుంచి, 3500 సర్వీసులు
తెలంగాణలో పెద్ద పండగ దసరా.. పండగకు ఊరికి వెళుతుంటారు. సిటీ దాదాపుగా ఖాళీ అవుతుంటాయి. ఇందుకోసం ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులు నడుపుతుంది. ఈ సారి కూడా సర్వీసులను ఎక్కువే వేసింది. ఈ నెల 24 నుంచి వచ్చే నెల 7 వరకు దసరా స్పెషల్ బస్సులను నడుపాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలోని రంగారెడ్డి రీజయన్ నుంచి దాదాపు 3,500 ఆర్టీసీ బస్సులను దసరా స్పెషల్స్గా జిల్లాలకు నడిపించడానికి ఆర్టీసీ అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. హైదరాబాద్ సిటీలో అన్ని ప్రధాన ప్రాంతాలైనా మియాపూర్, కూకట్పల్లి, జేబీఎస్, సికింద్రాబాద్, ఉప్పల్, ఎల్బీనగర్, కోఠి వంటి ప్రాంతాల నుంచి దసరా స్పెషల్ బస్సులు ఉంటాయి.
దసరా నేపథ్యంలో సిటీ నుంచి సొంత ఊర్లకు వెళ్లడం కోసం ముందుగానే రిజర్వేషన్లు చేసుకునేందుకు ప్రయాణికులు చేస్తున్నారు. రెండు రోజుల్లో ఆర్టీసీ ప్రత్యేక బస్సుల అంశంపై పూర్తి సమాచారం వెలువడుతుందని ఆర్టీసీ రంగారెడ్డి ప్రాంత అధికారి శ్రీధర్ తెలిపారు. 26వ తేదీ నుంచి 15 రోజుల పాటు దసరా సెలవులు ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే స్పెషల్ బస్సులు అందుబాటులోకి తీసుకొచ్చారు.