యూపీలో తక్కువగా ఇంటర్నెట్ వినియోగం.. అసదుద్దీన్ ఒవైసీ
5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నెల 15 వరకు ర్యాలీలు, రోడ్ షోలు, ఇతర ప్రచార కార్యక్రమాలపై నిషేధం విధించింది. 15 తర్వాత పరిస్థితిని సమీక్షించి ఎన్నికల ప్రచారంపై నిర్ణయం తీసుకుంటామని, అప్పటివరకు రాజకీయ పక్షాలు సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసుకోవాలని సూచించింది.
ఇంటర్నెట్ లేదే..?
ఎన్నికల సవాల్ను తాము స్వీకరిస్తున్నామని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. జనవరి 15 తర్వాత ఎన్నికల సంఘం తన మార్గదర్శకాలను మరోసారి సమీక్షిస్తుందని ఆశిస్తున్నామని తెలిపారు. దేశంలో డిజిటల్ సమాచార వినియోగం ఎలా ఉందనే దానిపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారిస్తే బాగుంటుందని ఒవైసీ సూచించారు. నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం యూపీలో ప్రతి 100 మందిలో కేవలం 39 మందే ఇంటర్నెట్ వినియోగిస్తుంటారని వెల్లడించారు. భారత్ లో అత్యంత తక్కువగా ఇంటర్నెట్ వినియోగించే ప్రాంతాల్లో ఇదీ ఒకటని వివరించారు. ఎన్ఎస్ఎస్ నివేదిక ప్రకారం యూపీలో గ్రామీణ ప్రాంతాల్లో కంప్యూటర్లు ఉన్న గృహాలు 4 శాతం, ఇంటర్నెట్ సౌకర్యం ఉన్నవారి శాతం 11 మాత్రమేనని పేర్కొన్నారు.
19 శాతం మందికే
యూపీలో ధనిక వర్గాల్లో 19 శాతం మందికి ఇంటర్నెట్ సదుపాయం ఉండగా, పేదల్లో 6 శాతం మందికే అందుబాటులో ఉందని తెలిపారు. యూపీ పట్టణ ప్రాంతాల్లో 50 శాతం మహిళలు ఇప్పటివరకు ఇంటర్నెట్ ను వినియోగించలేదని, గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ వినియోగం తెలియని వాళ్లు 76 శాతం మంది ఉన్నారని ఒవైసీ వివరించారు. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో కనీసం ఒకసారి ఇంటర్నెట్ వినియోగించిన పురుషుల శాతం 54 కాగా, రాష్ట్రంలో 46.5 శాతం మంది మహిళలకే సొంత అవసరాల నిమిత్తం ఫోన్లు ఉన్నాయని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో డిజిటల్ ప్రచారం నిర్వహించడం ఎలా? అని ప్రశ్నించారు.
5 రాష్ట్రాల పోల్
ఐదు రాష్ట్రాల్లోని 690 అసెంబ్లీ సీట్లకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. గోవాలోని 40, పంజాబ్ లో 117, యూపీలో 403, మణిపూర్ లో 28, ఉత్తరాఖండ్ లోని 70 సీట్లు ఉన్నాయి. వీటికి వివిధ దశల్లో ఎన్నికల నిర్వహణకు వీలుగా ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. కోవిడ్ పరిస్ధితుల దృష్ట్యా ప్రతీ పోలింగ్ బూత్ లోనూ ఓటర్ల సంఖ్యను 1250కి తగ్గిస్తూ ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఈ సంఖ్య 1500గా ఉండేది. ఈ ఎన్నికల్లో ఐదు రాష్ట్రాల్లోని మొత్తం 18..34 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఐదు రాష్ట్రాల్లో మొత్తం 24.5 లక్షల కొత్త ఓటర్లు ఈసారి ఓటేయబోతున్నారు. అభ్యర్ధులకు ఆన్ లైన్ లో నామినేషన్ దాఖలు చేసే అవకాశాన్ని ఈసీ కల్పించింది.