కాకతీయ శిల్ప కళా నైపుణ్యానికి నిదర్శనం: వెంకయ్య, మోడీ కృషి వల్లే: బండి సంజయ్
రామప్ప ఆలయానికి యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు ఇవ్వడంపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పందించారు. తెలంగాణ రాష్ట్రంలో 13వ శతాబ్దం నాటి రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ స్థలంగా యునెస్కో గుర్తింపు దక్కడం హర్షణీయం అన్నారు. కాకతీయ శిల్ప కళా నైపుణ్యానికి నిలువెత్తు నిదర్శనమని ఆలయం అని అభివర్ణించారు.
2020 ఏడాదికి దేశంలో ఒక్క కట్టడానికే గుర్తింపు దక్కిందని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందిన తొలి కట్టడం రామప్ప ఆలయం అని వెంకయ్య నాయుడు వివరించారు. ఇది తెలుగు వారంతా గర్వించదగిన విషయం అని తెలిపారు. ఇటు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కూడా స్పందించారు. రామప్ప ఆలయానికి గొప్ప గుర్తింపు దక్కడం కోసం సభ్యదేశాలతో ఏకాభిప్రాయం సాధించడానికి ప్రధాని మోడీ ఎంతో కృషి చేశారని వెల్లడించారు.
Recommended Video
ఎంతో వేగంగా నిర్ణయాలు తీసుకుని, సత్వర చర్యలు చేపట్టారని బండి సంజయ్ తెలిపారు. అన్ని దేశాల ఏకాభిప్రాయంతో ఇది సాధ్యమైందని స్పష్టం చేశారు. తెలంగాణ చారిత్రక గొప్పదనాన్ని విశ్వవేదికపై నిలబెట్టిన ఘనత మోదీ సర్కారుదేనని బండి సంజయ్ ఉద్ఘాటించారు. రామప్ప ఆలయానికి ఇంతటి గుర్తింపు లభించడంలో తోడ్పాటును అందించిన ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర పర్యాటక మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర సహాయమంత్రి మీనాక్షి లేఖిలకు కృతజ్ఞతలు తెలిపారు.
కాకతీయ రాజులు నిర్మించిన చారిత్రక దేవాలయం రామప్ప. ఇదీ ములుగు జిల్లా, వెంకటాపూర్ మండలంలో గల పాలంపేట అనే గ్రామంలో ఉంది. రామప్పను రామలింగేశ్వర దేవాలయం అని కూడా పిలుస్తారు. ఆలయం విశ్వబ్రాహ్మణ శిల్పుల పనితనానికి మచ్చుతునకగా చెబుతారు. ఆలయం పక్కనే రామప్ప సరస్సు ఉంది. ఆ చెరువు కాకతీయుల కాలం నాటిది. ఇది ఇప్పటికి వేల ఎకరాల పంటకు ఆధారంగా ఉంది.