వెదర్ అప్డేట్: మరో మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఆరెంజ్ అలర్ట్ జారీ
హైదరాబాద్: రాజధాని నగరం హైదరాబాద్తోపాటు తెలంగాణ వ్యాప్తంగా గత వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే, ఆదివారం రోజున ఎడతెరిపిలేని వాన కొంత విశ్రాంతి తీసుకుంది. దీంతో ప్రజలు కొంత ఊపిరిపీల్చుకున్నారు. బయటికి వచ్చి పనులు చేసుకున్నారు. అయితే, రానున్న మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
జులై 25, 26 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఈ రెండు రోజులు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ఆదివారం దక్షిణ ఒడిశా పరిసరాలలో సగటు సముద్రమట్టం నుంచి 3.1 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది.

24న ఒక అల్ప పీడనం కూడా దక్షిణ ఒడిశా-ఉత్తర ఆంధ్రా దగ్గరలోని వాయవ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు గంటలకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు కూడా షీయర్ జోన్ 20 ఎన్ అక్షాంశం వెంబడి సగటు సముద్ర మట్టం నుంచి 3.1 కి.మీ నుంచి 5.8 కి.మీ ఎత్తులో కొనసాగుతోందని తెలిపింది.
మరోవైపు, దేశ వ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో ఆదివారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. గుజరాత్, గోవా, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉత్తరాఖండ్, పంజాబ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, పశ్చిమబెంగాల్, సిక్కిం, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ఇప్పటికే గుజరాత్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, మహారాష్ట్ర, అస్సాంలలో కురుస్తున్న భారీ వర్షాలతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.












Click it and Unblock the Notifications