స్కూటర్ లేని కేసీఆర్కు విమానం కొనుక్కునేంత డబ్బేక్కడిది: షర్మిల
సీఎం కేసీఆర్పై వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇవాళ మరోసారి విమర్శలు చేశారు. వైఎస్ఆర్ సీఎంగా ఉన్న సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రూ.38 వేల కోట్లు మాత్రమేనని గుర్తుచేశారు. కేసీఆర్ సీఎం అయ్యాక లక్షా 20 వేల కోట్ల రూపాయలకు పెంచేశారని తెలిపారు. భారీగా అవినీతి జరిగిందని చెప్పడానికి ఇంత కన్నా ఉదహరణ ఏముందని అడిగారు.
కేసీఆర్ అవినీతి దాహానికి కాళేశ్వరం ప్రాజెక్టు సజీవ సాక్ష్యం అని విమర్శించారు. చిన్న పనుల నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు వరకు ఒక కాంట్రాక్టు సంస్థకే అప్పగించారని.. ఇదంతా అవినీతిలో భాగమేనని వివరించారు. ఒకప్పుడు స్కూటర్ కూడా లేని సీఎం కేసీఆర్కు ఇప్పుడు విమానం కొనుక్కునేంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని షర్మిల ప్రశ్నించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి నుంచే వచ్చిందని ఆరోపించారు. కేసీఆర్ అసమర్థత వల్ల కాళేశ్వరం ప్రాజెక్టు దేనికీ పనికి రాకుండా పోయిందన్నారు. కేసీఆర్ అవినీతిపై మాట్లాడే కేంద్ర మంత్రులు దీనిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ అవినీతిపై ఢిల్లీలో సీబీఐకి ఫిర్యాదు చేశానని.. డీఐజీ స్థాయి అధికారితో విచారణ జరిపించాలని కోరానని షర్మిల తెలిపారు.
బీఆర్ఎస్ అంతా డ్రామా అని, దాంతో దేశానికి ఒరిగేదేమీ లేదని షర్మిల కామెంట్ చేశారు. కేసీఆర్ స్వార్థ ప్రయోజనాలే ఉంటాయని తెలిపారు.జనం మేలు కోరేందుకు పాటుపడరని చెప్పారు.