మెట్రోలో జర భద్రం.. ఆ సీటును కనీసం ముట్టుకోవద్దు.. లేదంటే వంద బొక్కే
మెట్రోలో ప్రయాణం చేస్తున్నారా.. ఈ విషయం గుర్తుంచుకోండి.. ఖాళీగా ఉంది కదా అని సీట్లో కూర్చునే ముందు ఒకటికి రెండుసార్లు చూసుకోండి. పర్లేదు అని కూర్చున్నారా అంతే సంగతులు. ముఖ్యంగా స్త్రీలకు కేటాయించిన సీట్లలో అయితే కూర్చొవద్దు. అలా ఆశీనులు అయితే మాత్రం మీరు ఫైన్ కట్టక తప్పదు. స్త్రీలకి కేటాయించిన సీట్లలో పురుషులు కూర్చుంటే తర్వాత వచ్చే స్టేషన్లో రైలు నుంచి బయటకు దింపి మరీ ఫైన్ కట్టిస్తారు. ఇదీ మెట్రోలో నయా రూల్.. జర జాగ్రత్తగా ఉండండి సుమ.
మెట్రో రైలు కార్పొరేషన్లో 292 ఉద్యోగాలు: అర్హతలు ఇవే... !
ఆల్రెడీ ఇలా ఫైన్ కట్టినవాళ్లు చాలా మంది ఉన్నారు. ఈ నెల 12న ఓ కుటుంబానికి చెందిన ఆరుగురు ఫస్ట్ టైం మెట్రో రైలెక్కారు. జనరల్ కోచ్లలో సీట్లు ఖాళీ లేవు. దీనితో ఖాళీగా ఉన్నాయని స్త్రీలకి కేటాయించిన సీట్లలో కూర్చున్నారు. ఈఎస్ఐ స్టేషన్లో వారిని కోచ్ నుంచి బయటకు దించిన పోలీసులు, మెట్రో సిబ్బంది ఒక్కొక్కరికి రూ.100 చొప్పున ఆరుగురికి రూ.600 జరిమానా వేసి రసీదులు చేతిలో పెట్టారు. దీంతో ఖంగుతినడం వారి వంతయిపోయింది.
ఈ విషయం మాకు తెలియదని మొర్రో అన్న పట్టించుకోలేదు. మహిళలు ఎవరు సీటు కావాలని అడగలేదని, సీటు ఇవ్వలేదని ఎవరైనా ఫిర్యాదు చేసినా, వాళ్లు నిలబడి ఉన్నా మాకు జరిమానా వేశారంటే అర్థం ఉంది కానీ ఇదేటండని వాదోపవాదానికి దిగారు. అయినప్పటికీ అధికారులు వినకపోవడంతో జరిమానా కట్టి మరో మెట్రో రైలులో వెళ్లారు. తాము గుంటూరు నుంచి వచ్చామని, సరదాగా మెట్రోలో ప్రయాణం చేద్దామని రైలెక్కమని, కానీ ఈ రూల్స్ తెలియక జేబులకు చిల్లుపెట్టుకున్నామని వాపోయారు. ఇక మెట్రోలో ప్రయాణించే మగ మహారాజులు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకుంటే మంచిదని సూచిస్తున్నారు.