కత్తులు, గొడ్డళ్లు, చైన్ దొంగలు.. పోలీస్ శాఖను కలవరపెట్టిన 2018
హైదరాబాద్ : తెలంగాణ పోలీస్ శాఖకు 2018వ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఇచ్చిందని చెప్పొచ్చు. డిపార్టుమెంట్ గణాంకాల ప్రకారం కేసుల సంఖ్య తగ్గినా.. నేరగాళ్లు బుసలు కొట్టారు. శాంతిభద్రతలు కాపాడే విషయంలో పోలీస్ శాఖ ఫుల్ మార్కులు కొట్టేసినా.. నేరాలు అరికట్టడంలో వైఫల్యం చెందిందనే వాదనలున్నాయి.
మొత్తానికి 2018 పోలీస్ శాఖకు మిగిల్చిన అనుభవాలపై ఇయర్ ఎండ్ ఫోకస్.

పోలీస్ శాఖ +, -
తెలంగాణ ఏర్పడ్డాక వరుసగా నాలుగో ఏడాది కూడా పోలీస్ శాఖ మెరుగైన పనితీరు కనబరిచిందని చెప్పొచ్చు. శాంతిభద్రతల విషయంలో ఫుల్ మార్కులు కొట్టేసింది. ఆధునీకరణ చెందడం, టెక్నాలజీ అందిపుచ్చుకోవడం ప్లస్ పాయింట్ గా మారింది. పండుగలు, వేడుకలు, అసెంబ్లీ ఎన్నికలు ఇలా ప్రతిదీ సవ్యంగా జరగడంతో పోలీస్ శాఖకు ప్రశంసలు లభించాయి. అయితే మంచి వెనకాలే చెడు ఉంటుందన్నట్లుగా కొన్ని విషయాల్లో రిమార్క్స్ కూడా ఉండటం గమనార్హం.

పోలీస్ బాస్ గణాంకాలు
టెక్నాలజీని అందిపుచ్చుకుని నేరాల నియంత్రణకు కృషి చేస్తున్నామంటున్నారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్. 2018 నేరాల రివ్యూకు సంబంధించి మీడియాతో మాట్లాడిన సీపీ.. హైదరాబాద్ పరిధిలో అత్యాచారాలు, కిడ్నాపులు, చైన్ స్నాచింగ్ లు ఈ ఏడాది 65 శాతం దాకా తగ్గినట్లు చెప్పారు. 2017 లో 53 చైన్ స్నాచింగ్ కేసులు నమోదవ్వగా.. ఈ ఏడాది 20 మాత్రమే రికార్డయినట్లు చెప్పారు. అదలావుంటే చైన్ దొంగలకు కళ్లెం వేశామని చెప్పిన కొద్దిగంటల్లోనే ముష్కరులు పోలీసులకు సవాల్ విసిరారు. అరగంటలో అరడజను, 24 గంటల్లో డజను గొలుసు దొంగతనాలు నమోదుకావడం పోలీస్ శాఖను కలవరపెట్టింది.
డిసెంబర్ 26, 27 తేదీల్లో జరిగిన వరుస గొలుసు దొంగతనాలు పోలీసుల పనితీరుకు అద్దం పట్టిందనే ఆరోపణలొచ్చాయి.
గృహ హింసకు సంబంధించి 2018లో హైదరాబాద్లో 3,220 కేసులు, పోస్కో చట్టం కింద 579 కేసులు, ఇతరత్రా నేరాల్లో 651 కేసులు నమోదయినట్లు వెల్లడించారు. షీటీమ్స్ ప్రత్యేకంగా 926 కేసులు నమోదు చేయడం విశేషం. 2017లో సీసీ ఫుటేజ్ ద్వారా 3,200 కేసుల్ని పరిష్కరించగా.. 2018లో 3,885 కేసుల్ని డీల్ చేశారు. దాదాపు 90శాతం కేసులు సీసీ ఫుటేజ్ ద్వారా పరిష్కారం అవుతున్నాయని చెప్పారు.
మావోయిస్టులతో తెలంగాణకు ముప్పు లేదన్నారు సీపీ. దేశంలోని ఇతర నగరాలతో పోల్చితే హైదరాబాద్లో డ్రగ్స్ వాడకం కూడా చాలా తక్కువే అని వివరించారు. ఇక హైదరాబాద్ లో బైకులు అడ్డదిడ్డంగా నడిపిన 5వేల మందిపై చర్యలు తీసుకున్నామన్నారు. 2018లో డ్రంక్ అండ్ డ్రైవ్ లో 26వేల మందికి పైగా పట్టుబడటం గమనార్హం.

రోడ్లపై కత్తులు, గొడ్డళ్లు
2018లో కత్తులు, గొడ్డళ్లతో నడిరోడ్లపై రెచ్చిపోయారు కొందరు. నల్గొండ జిల్లాలో ప్రేమించి పెళ్లిచేసుకోవడంతో అమ్మాయి తండ్రి.. ప్రణయ్ అనే యువకుడ్ని నడిరోడ్డుపై దుండగులతో చంపించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చానీయాంశమైంది. పాతకక్షల నేపథ్యంలో హైదరాబాద్ లోని అత్తాపూర్ నడిరోడ్డుపై ఓ యువకుడిని పాశవికంగా గొడ్డలితో చంపిన ఘటన పోలీసుల వైఫల్యానికి పరాకాష్టగా మిగిలింది. అది జరిగిన ఐదు రోజులకే ఎర్రగడ్డ ప్రాంతంలో తన కూతురు ప్రేమించిన యువకుడిపై ఓ తండ్రి కత్తితో దాడి చేయడం కలకలం రేపింది. ఇలాంటి అనేక ఘటనలు పోలీస్ శాఖకు తలనొప్పిగా మారాయి. అక్రమ సంబంధాలు, భర్తలను చంపిన భార్యలు, తల్లిదండ్రులను చంపిన తనయులు, ఆస్తుల కోసం అయినవారిని చంపిన ఘటనలు కొకొల్లలు.

షీ టీమ్స్ - వైట్ కాలర్
మహిళలపై జరుగుతున్న దాడులు అరికట్టేందుకు ఏర్పాటు చేసిన షీ టీమ్స్ 2018లో మంచి ఫలితాలు కనబరిచాయి. పోకిరీలు, ఆకతాయిలకు సంకెళ్లు వేశాయి. పలుచోట్ల జరిగిన ఘటనలపై వేగంగా స్పందించిన షీ టీమ్స్ ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంది. అయితే కొన్ని సందర్భాల్లో మహిళలపై జరిగిన ఆకృత్యాలు ఆందోళన కలిగించాయి.
వైట్ కాలర్ నేరాలు పోలీసు శాఖకు ఈ ఏడాది మరింత సవాల్ విసిరాయి. విదేశీ నేరగాళ్లు హైదరాబాద్ లో మకాం వేసి కోట్లాది రూపాయలను దోచుకున్నారు. ఎందరినో పట్టుకుని బొక్కలో వేసినా.. కొత్తవాళ్లు మళ్లీ పుట్టుకొచ్చారు. 2018 లో వైట్ కాలర్ నేరగాళ్లతో పోలీసులకు తలనొప్పి తప్పలేదు. డిసెంబర్ నెలలో వెయ్యికి లక్ష ఇస్తానంటూ 25 కోట్ల రూపాయల మోసం చేసి జల్సాలు చేసిన ఇద్దరు అన్నదమ్ముల్ని కటాకటాల్లోకి నెట్టారు. కొన్ని కేసులు మాత్రం తేలక.. ఆరోపణలు కూడా మూటగట్టుకుంది పోలీస్ శాఖ.

మావోయిస్టుల కలకలం
కొన్నాళ్ల నుంచి స్తబ్ధుగా ఉన్న మావోయిస్టుల ఉనికి 2018లో పోలీసులకు సవాల్ గా మారింది. ఉత్తర తెలంగాణలోని మావోయిస్టు కదలికలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పెద్దసంఖ్యలో వాల్ పోస్టర్లు వెలిశాయి. దీంతో మళ్లీ మావోయిస్టులు దాడులకు దిగుతారనే భయం వెంటాడింది. ఉమ్మడి వరంగల్లో మూడుచోట్ల మందు పాతరలు పోలీసుల కంటపడ్డాయి. లేదంటే ఎంత పెద్ద ప్రమాదాలు జరిగి ఉండేవో ఊహించడం కష్టం. ముందస్తు అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ.. భద్రాద్రి జిల్లాలో పోలీసులే టార్గెట్ గా అమర్చిన మందుపాతర దొరికి మరో ప్రమాదం తప్పింది.

సోషల్ మీడియా ఫేక్.. పోలీసులకు షాక్
టెక్నాలజీ, సోషల్ మీడియా వినియోగంతో నేరాలకు అడ్డుకట్ట వేయడానికి కృషి చేస్తున్న పోలీసులకు ఈ సంవత్సరం అవే తలనొప్పిగా మారాయి. 2018 లో సోషల్ మీడియాలో జరిగిన కొన్ని తప్పుడు ప్రచారాలకు కొంతమంది బలయ్యారు. చిన్నపిల్లలను ఎత్తుకుపోతున్నారని, జంతువులను దొంగిలిస్తున్నారని.. గ్రామంలోకి కొత్తగా ఎవరైనా వస్తే జాగ్రత్తగా ఉండాలనే అబద్దపు వార్తలు వైరల్ కావడంతో పలుచోట్ల వ్యక్తులపై దాడులు జరిగాయి. ఇలాంటి ఘటనల్లో దాదాపు ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇలా అసత్య ప్రచారాల్ని కట్టడి చేయడంలో పోలీసులు విఫలమయ్యారనే ఆరోపణలొచ్చాయి.

కార్డన్ సెర్చ్
కార్డన్ సెర్చ్ (ముందస్తు నిర్భంధ తనిఖీలు) పోలీసుల పాలిట వరంగా మారింది. 2018లో రాష్ట్రంలోని పలుచోట్ల వీపరితంగా కార్డన్ సెర్చ్ చేయడంతో మంచి ఫలితాలు వచ్చాయని చెప్పొచ్చు. అనుమానస్పద వ్యక్తులు పోలీసులకు తారసపడ్డారు. కేసులు బుక్ చేసి కటాకటాల్లోకి నెట్టడంతో ముందస్తు వ్యూహం ఫలించినట్లైంది. నేరాలకు పాల్పడాలని స్కెచ్ వేసినవారికి కార్డన్ సెర్చ్ ద్వారా ముందస్తు కట్టడి చేశారు పోలీసులు. ఇది మంచి ఫలితాలు ఇవ్వడమే గాకుండా ప్రజల్లో అవగాహన, ధైర్యం పెంచింది. నేరగాళ్ల పాలిట సింహస్వప్నంలా మారింది.

ప్రమాదాలు
2018లో తెలంగాణ ముఖచిత్రంపై రోడ్డు ప్రమాదాలు మాయని మరకను మిగిల్చాయి. అవుటర్ రింగ్ రోడ్డు, బెంగళూరు-విజయవాడ జాతీయ రహదారులు, రాజీవ్ రహదారితో పాటు మరికొన్ని రాష్ట్ర రహదారులపై జరిగిన ప్రమాదాల్లో మృతుల సంఖ్య భారీగా ఉంది. జగిత్యాల జిల్లాలోని కొండగట్టు దగ్గర ఆర్టీసీ బస్సు 60 మందికి పైగా పొట్టన పెట్టుకుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ట్రాక్టర్లు బోల్తాపడ్డ మూడు ఘటనల్లో దాదాపు 90 మంది మృత్యువాత పడటం రాష్ట్రవ్యాప్తంగా విషాదం నింపింది. అటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రయాణీకులతో వెళుతున్న ఆటో వ్యవసాయబావిలో పడటంతో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. 2018 లో ఇలాంటి ఘటనలు కొకొల్లలు. చాలా ప్రమాదాల్లో ఒకరిద్దరు చనిపోలేదు.. కుటుంబాలకు కుటుంబాలు ప్రాణాలు పొగొట్టుకున్నాయి. రాజ్యసభ సభ్యుడు, టీడీపీ సీనియర్ నేత హరికృష్ణ ఉమ్మడి నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోవడం నందమూరి కుటుంబంలో విషాదం నింపింది.

పెండింగ్ కేసులు
పెండింగ్ కేసుల విషయంలో పోలీస్ శాఖ అప్రతిష్ట మూటగట్టుకుంటోంది. చాలా కేసుల్లో విచారణకు అతీగతీ లేకుండా పోయిందనే వాదనలున్నాయి. ఎంసెట్ స్కామ్, ఇందిరమ్మ ఇళ్ల కుంభకోణం, బోధన్లో వాణిజ్య పన్నుల స్కామ్, ఆరోగ్య శ్రీ స్కామ్ ఇలా చాలా వాటిలో ఒక్క అడుగు ముందుకు పడిన దాఖలాలు లేవు.
పెండింగ్ కేసుల అంశం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉండటంతో పోలీసు శాఖకు మైనస్ గా మారింది.
-
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల..












Click it and Unblock the Notifications