పంజాగుట్టలో యువతిపై అత్యాచారం: బ్యాంక్ ఉద్యోగులమని చెప్పి ఇంట్లోకే నేరుగా వెళ్లి దారుణం
మహిళలకు బయటకు వెళితేనే రక్షణ లేదు అనుకునే రోజులు పోయి, మహిళలకు ఇంట్లో కూడా రక్షణ లేదు అనే భావన తాజా సంఘటనలతో కలుగుతోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎవరు ఏవిధంగా వచ్చి దారుణానికి పాల్పడతారో , ఎవరి మీద దాడి చేస్తారో అర్థంకాని పరిస్థితి మహిళా లోకాన్ని రోజురోజుకు భయాందోళనకు గురిచేస్తుంది. శాస్త్ర సాంకేతిక రంగాలలో అభివృద్ధి సాధించినా, అన్ని రంగాలలో మహిళలు మగవారికి ధీటుగా పనిచేస్తున్నా మహిళలపై జరుగుతున్న అకృత్యాలు మాత్రం ఆగడం లేదు.
పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన
నిత్యం ఎక్కడో ఒక చోట మహిళలు లైంగిక వేధింపులకు గురవుతూనే ఉన్నారు. బలవంతంగా అత్యాచారాలకు మృగాళ్లు పాల్పడుతూనే ఉన్నారు . తాజాగా ఇంట్లో ఒంటరిగా ఉన్న యువతిపై గుర్తు తెలియని వారు అత్యాచారానికి పాల్పడిన సంఘటన పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఓ ప్రైవేటు బ్యాంకు ఉద్యోగినంటూ ఇంట్లోకి చొరబడిన ఇద్దరు వ్యక్తులు పక్కా ప్లాన్ ప్రకారం యువతిపై అత్యాచారానికి పాల్పడిన సంఘటన భాగ్య నగర వాసులను ఆందోళనకు గురి చేసింది.
యువతి ఇంటికి బ్యాంక్ ఉద్యోగులమని వెళ్ళిన ఆగంతకులు .. పక్కా ప్లాన్ ప్రకారం దారుణం
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం డిఎస్ మక్తాలో నివాసం ఉంటున్న ఒక కుటుంబంలో కుటుంబ సభ్యులందరూ ఇటీవల మహారాష్ట్రకు వెళ్లారు. అయితే 23 సంవత్సరాల వయసున్న యువతి ఒక్కతే ఇంట్లో ఉంటుంది. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఓ ప్రైవేటు బ్యాంకు ఉద్యోగులం అంటూ యువతి ఇంట్లోకి చొరబడ్డారు. ఒక వ్యక్తి ఏదో ఇన్సూరెన్స్ పాలసీ గురించి యువతికి వివరిస్తున్నట్లుగా మాటల్లోకి దించగా , మరో వ్యక్తి ఇంటి బయట కాపలాగా నిలుచున్నాడు.
యువతిపై అత్యాచారానికి పాల్పడిన దుండగుడు .. పోలీసులకు ఫిర్యాదు
యువతితో మాట్లాడుతున్న సదరు వ్యక్తి ఇన్సూరెన్స్ పాలసీ గురించి మాటలు కలిపి ఆపై యువతిని వివస్త్రను చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. లైంగిక దాడి అనంతరం ఇద్దరూ అక్కడి నుండి పరారయ్యారు. ఈ సంఘటన తెలిసిన యువతి కుటుంబ సభ్యులు ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు . దీంతో పోలీసులు బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్లు పంజాగుట్ట ఎస్సై సతీష్ కుమార్ తెలిపారు. ఈ కేసును ఛేదించడం కోసం పోలీసులు ఘటన జరిగిన ప్రాంతంలోని సీసీ కెమెరాల ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు. యువతి ఒంటరిగా ఉంటుందని తెలిసిన వాళ్ళే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.