కేఎల్ రాహుల్కు ఏమైంది- మ్యాచ్ మధ్యలోనే పెవిలియన్కు..!!
చెన్నైలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ డీహైడ్రేషన్ కు గురయ్యాడు. మ్యాచ్ మధ్యలో వెనుదిరిగాడు. కొంత విశ్రాంతి తరువాత మళ్లీ కీపింగ్ చేశాడు.
చెన్నై: చెన్నై చెపాక్ లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో భారత్- ఆస్ట్రేలియా మధ్య మూడో వన్డే ఇంటర్నేషనల్ రసవత్తరంగా సాగుతోంది. సిరీస్ డిసైడర్ కావడం వల్ల అందరి దృష్టీ దీని మీదే నిలిచింది. ఇందులో గెలిచిన జట్టుకే సిరీస్ సొంతమౌతుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా ప్రారంభ ఓవర్లల్లో తడబడింది. ఓపెనర్లు జట్టుకు శుభారంభాన్ని అందించినప్పటికీ.. టాప్ ఆర్డర్ దాన్ని కొనసాగించలేకపోయింది.

దూకుడుగా ఓపెనర్లు..
ఆసీస్ ఓపెనర్లు ట్రవిస్ హెడ్, మిఛెల్ మార్ష్ దూకుడుగా ఆడారు. ప్రారంభ ఓవర్లల్లో టీమిండియా బౌలర్లపై విరుచుకుపడ్డారు. భారీ షాట్లతో స్కోర్ బోర్డును పరుగులెత్తించారు. 11వ ఓవర్ అయిదో బంతికి ట్రవిస్ హెడ్ అవుట్ అయ్యేంత వరకూ మ్యాచ్ మొత్తం ఆసీస్ చేతుల్లోనే కనిపించింది. జట్టు స్కోర్ 68 పరుగుల వద్ద ఉన్నప్పుడు అతను అవుట్ అయ్యాడు. 31 బంతుల్లో నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లతో 33 పరుగులు చేశాడు. హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో కుల్దీప్ యాదవ్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

స్టీవ్ డక్..
ఆ తరువాత బ్యాటింగ్ కు దిగిన కేప్టెన్ స్టీవ్ స్మిత్ నిరాశపరిచాడు. డకౌట్ అయ్యాడు. పాండ్యా బౌలింగ్ లో వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అప్పటికి జట్టు స్కోర్ 74 పరుగులు. పాండ్యా సంధించిన బంతిని డ్రైవ్ చేయబోయిన స్టీవ్ టైమింగ్ మిస్ అయ్యాడు. బ్యాట్-ఎడ్జ్ తీసుకున్న ఆ బంతిని కేఎల్ రాహుల్ డైవ్ చేస్తూ అద్భుతంగా అందుకున్నాడు. 85 పరుగులకు మరో వికెట్ కోల్పోయింది ఆసీస్. 47 పరుగుల వద్ద మిఛెల్ మార్ష్ అవుట్ అయ్యాడు.

కేఎల్ రాహుల్ పెవిలియన్ కు..
ఈ క్యాచ్ అందుకున్న తరువాత కేఎల్ రాహుల్.. ఎక్కువ సేపు గ్రౌండ్ లో నిల్చోలేకపోయాడు. ఎండ తీవ్రతను తట్టుకోలేకపోయాడు. డీహైడ్రేషన్ కు గురయ్యాడు. వికెట్ల వెనకల నీరసంగా, చెమటతో తడిచిపోయి కనిపించాడీ వికెట్ కీపర్ బ్యాటర్. 17వ ఓవర్ ముగిసిన తరువాత విశ్రాంతి కోసం డ్రెస్సింగ్ రూమ్ వెళ్లాడు. ఆ సమయంలో టీ20 ఓపెనర్ ఇషాన్ కిషన్.. వికెట్ల వెనుకల నిల్చున్నాడు. వికెట్ కీపింగ్ బాధ్యతలను తీసుకున్నాడు. 29వ ఓవర్ లో కేఎల్ రాహుల్.. మళ్లీ గ్రౌండ్ కు వచ్చాడు. కీపింగ్ కొనసాగిస్తోన్నాడు.

సాధారణం కంటే..
వేసవిలో చెన్నైలో ఎండ తీవ్రత ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు. సముద్రానికి దగ్గరగా ఉండటం వల్ల గాలిలో తేమశాతం అధికంగా ఉంటుంది. ఉక్కపోత అధికంగా ఉంటుందక్కడ. ప్రస్తుతం 32 డిగ్రీల ఎండ కాస్తోంది. గాలిలో తేమశాతం 72 శాతంగా రికార్డయింది. గొంతు తడారిపోవడం, ఉక్కపోత, చెమట వల్ల కేఎల్ రాహుల్ ఇబ్బంది పడ్డాడు. కొద్దిసేపు డ్రెస్సింగ్ రూమ్ లో విశ్రాంతి తీసుకున్న తరువాత మళ్లీ గ్రౌండ్ లోకి దిగాడు.












Click it and Unblock the Notifications