వ్యాక్సిన్ తీసుకున్నా కరోనా: సంచలన డేటా బయటపెట్టిన కేంద్రం -టీకా తర్వాతా ఇన్ఫెక్ట్ అయింది 0.04శాతమే
దేశంలో కరోనా మహమ్మారి రెండో దశ వ్యాప్తి అత్యంత ప్రమాదరకంగా సాగుతూ, కొత్త కేసులు 3లక్షలకుపైగా, మరణాలు రెండు వేలకు చేరువగా నమోదవుతుండగా, కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరం చేశాయి. మే 1 నుంచి 18ఏళ్లు నిండిన అందరికీ వ్యాక్సిన్లు అందజేయనున్నారు. అయితే, వ్యాక్సిన్లు తీసుకున్నవారు కూడా మళ్లీ కొవిడ్ బారినపడుతుండటంతో టీకాల సామర్థ్యంపై తీవ్ర చర్చ జరుగుతున్నది. కరోనా విలయానికి వ్యాక్సినేషన్ మాత్రమే విరుగుడు అనే భావనను ధృవపరుస్తూ కేంద్ర ప్రభుత్వం సంచలన డేటాను బుధవారం విడుదల చేసింది. ఆ వివరాలిలా ఉన్నాయి..

కొవాగ్జిన్ 0.04% -కొవిషీల్డ్ 0.03%
కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా ఎంత మంది మళ్లీ ఇన్ఫెక్షన్ కు గురయ్యారనే వివరాలతోపాటు టీకాల సమర్థతకు సంబంధించిన అంశాలపై కేంద్ర సర్కారు వారి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్), నీతి ఆయోగ్ సంస్థలు కీలక డేటాను విడుదల చేశాయి. ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ్, నీతి ఆయోగ్ (హెల్త్) సభ్యుడు కేవీ పాల్ ఈ మేరకు మీడియాతో మాట్లాడారు. ఇప్పటిదాకా కొవాగ్జిన్ టీకా రెండో డోసు కూడా తీసుకున్నవారిలో కేవలం 0.04శాతం మంది మాత్రమే తిరిగి ఇన్ఫెక్ట్ అయ్యారని, కొవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నవారిలో 0.03శాతం మందికి మాత్రమే మళ్లీ కొవిడ్ పాజిటివ్ వచ్చిందని డేటాలో పేర్కొన్నారు. అంటే..

టీకా తర్వాత కరోనా బాదితుల డేటా
కేంద్ర సహకారంతో భారత్ బయోటెక్ రూపొందించిన కొవాగ్జిన్, ఆస్ట్రాజెనెకా, ఆక్స్ ఫర్డ్ వర్సిటీలతో కలిసి సీరం అభివృద్ధి చేసిన కొవిషీల్డ్ టీకాలను మన దేశంలో ప్రధానంగా వినియోగిస్తుండటం తెలిసిందే. మంగళవారం సాయంత్రం వరకు మొత్తం 1.1కోట్ల కొవాగ్జిన్ డోసులను పంపిణీ అయ్యాయి. 93లక్షల 56వేల 436మందికి మొదటి డోసు అందగా అందులో 4208 మంది మళ్లీ వైరస్ బారినపడ్డారు. ఇదే కొవాగ్జిన్ రెండో డోసూ తీసుకున్నారి సంఖ్య 17లక్షల 37వేల 179 ఉండగా, అందులో కేవలం 695మందికి అంటే, 0.04శాతం మాత్రమే మళ్లీ ఇన్ఫెక్ట్ అయ్యారు. ఇక కొవిషీల్డ్ టీకాలను ఇప్పటివరకు 11.6కోట్ల డోసులు సరఫరా చేయగా, తొలి డోసు తీసుకున్న 10.03కోట్ల మందిలో 17,145(0.02శాతం)మందికి తిరిగి కరోనా సోకింది, కొవిషీల్డ్ రెండో డోసు పొందినవారి సంఖ్య 1,57,32,754కాగా, అందులో 5014మంది అంటే 0.03శాతం మంది తిరిగి ఇన్ఫెక్ట్ అయ్యారు. ప్రపంచంలో టీకాల పనితీరు చూసుకుంటే రెండో డోసు తీసుకున్న తర్వాత కూడా ఇన్ఫెక్షన్లకు గురైనవారి సంఖ్య పరంగా ఇది అత్యల్పమని అధికారులు అంటున్నారు.
Recommended Video

సామాన్యులకు టీకాలతో సీన్ వేరే..
వ్యాక్సిన్లకు సంబంధించి డేటాను పక్కాగా మానిటర్ చేస్తున్నామని, టీకా తీసుకున్న తర్వాత కూడా కొందరు పాజిటివ్ గా నిర్ధారణ అవుతున్నప్పటికీ వారి ఆరోగ్య పరిస్థితి ప్రమాదరకంగా మారిన దాఖలాలేవీ లేవని ఐసీఎంఆర్ డీజీ బలరామ్ భార్గవ్ స్పష్టం చేశారు. 10వేల మంది టీకాలు తీసుకుంటే అందులో 2 నుంచి 4మంది మాత్రమే మళ్లీ ఇన్ఫెక్ట్ అవుతున్నారని, ఇదేమంత కంగారు పడాల్సిన విషయం కాదన్నారు. ''ప్రస్తుతం టీకాలు పొందినవారిలో హైరిస్క్ జోన్ లోని కొవిడ్ వారియర్లే ఎక్కువ మంది. అదే మే1 తర్వాత నుంచి సాధారణ పౌరులకూ వ్యాక్సిన్ పంపిణీ మొదలవుతుంది కాబట్టి అప్పుడు ఈ శాతాలు కూడా చాలా వరకు తగ్గి, వ్యాక్సిన్ల సమర్థత నిరూపితమయ్యే అవకాశం పెరుగుతుంది'' అని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ పాల్ వివరించారు.












Click it and Unblock the Notifications