కరోనా షాకింగ్: ఒక్కరితో 406 మందికి వైరస్.. ఇకపై ‘కంటైన్మెంట్’తోనే కట్టడి.. కేంద్రం కీలక ప్రకటన
ప్రపంచమంతటా కరోనా విజృంభణ కొనసాగుతూనేఉంది. మంగళవారం సాయంత్రానికి అన్ని దేశాల్లో కలిపి పాజిటివ్ కేసుల సంఖ్య 1.4లకు చేరువకాగా, అందులో 76వేల మంది చనిపోయారు. సుమారు 3లక్షల మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. ఇటలీలో అత్యధికంగా 16,523 మంది చనిపోగా, స్పెయిన్ లో దాదాపు 14వేలు, అమెరికాలో 11వేల మంది బలయ్యారు. మనదేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య గత 24 గంటల్లో భారీగా పెరిగింది. దీంతోపాటు వైరస్ వ్యాప్తికి సంబంధించిన షాకింగ్ విషయాలనూ కేంద్రం వెల్లడించింది.
ఇవీ తాజా లెక్కలు..
కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ రోజువారీ బ్రీఫింగ్ లో భాగంగా ఢిల్లీలో మంగళవారం మీడియాతో మాట్లాడారు. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 354 కొత్త కేసులు వచ్చాయని, ఎనిమిది మంది చనిపోయారని తెలిపారు. మొత్తంగా కేసుల సంఖ్య 4,421కి చేరగా, అందులో 117 మంది ప్రాణాలు కోల్పోయారని, 326 మంది వ్యాధి నుంచి కోలుకున్నారని అగర్వాల్ తెలిపారు.
ఒక్కరితో వందలమందికి..
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్నప్పటికీ చాలా మంది కరోనాను తేలికంగా తీసుకుంటున్నట్లు రిపోర్టులు రిపోర్టులు వస్తున్న దరిమిలా వైరస్ వ్యాప్తిపై కేంద్రం మరోసారి ప్రజలను హెచ్చరించింది. వైరస్ బారినపడిన ఒక వ్యక్తి.. లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా, సోషల్ డిస్టెన్స్ పాటించకపోతే.. అతని ద్వారా కనీసం 406 మందికి వైరస్ అంటుకునే ప్రమాదం ఉంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) తాజాగా జరిపిన అధ్యయనంలో ఈ విషయం బయటపడింది. ఐసీఎంఆర్కు చెందిన డాక్టర్ ఆర్.గంగా ఖేడ్కర్ ఈ మేరకు వెల్లడించిన విషయాలును సీరియస్ గా తీసుకోవాలని, చిన్నపాటి లక్షణాలు కనిపించినా వెంటే స్థానిక ఆస్పత్రులకు వెళ్లాలని కేంద్ర అధికారి అగర్వాల్ సూచించారు.
ఇకపై అదే మోడల్..
కరోనా వ్యాప్తి నియంత్రణ కోసం ప్రయోగాత్మకంగా చేపట్టిన ‘క్లస్టర్ కంటైన్మెంట్' విధానంతో అనుకున్న దానికంటే మంచి ఫలితాలు వచ్చాయని, ఇకపై దేశవ్యాప్తంగా అదే మోడల్ ను అనుసరించాలని యోచిస్తున్నట్లు అగర్వాల్ తెలిపారు. ‘‘రాజస్థాన్ లోని భిల్వారా, ఉత్తరప్రదేశ్ లోని గౌతంబుద్ధ నగర్, ఆగ్రాతోపాటు ఈస్ట్ ఢిల్లీలో ఆ స్ట్రాటజీ ఫలించింది''అని పేర్కొన్నారు. ఇంతకీ..
క్లస్టర్ కంటైన్మెంట్ అంటే?
ఏ ప్రాంతంలోనైతే ఒకేసారి ఎక్కువ సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు బయటపడతాయో.. దాన్ని కంటైన్మెంట్ కస్టర్ గా గుర్తిస్తారు. కేసుల తీవ్రతను బట్టి కొన్ని మండలాలు లేదా జిల్లా మొత్తాన్నీ కంటైన్మెంట్ జోన్ గా ప్రకటిస్తారు. ప్రభావిత ప్రాంతాలను మాత్రం బఫర్ జోన్లని పిలుస్తారు. ఒక్కసారి ఒక ప్రాంతాన్ని కంటైన్మెంట్ కస్టర్ గా ప్రకటించిన తర్వాత ఆ ప్రాంతమంతా తప్పనిసరి నిర్బంధం(క్వారంటైన్)లోకి వెళ్లిపోతుంది. ఎంట్రీ, ఎగ్జిట్ లను పూర్తిగా మూసేస్తారు. 28 రోజుల పాటు ఆ ప్రాంతాన్ని సీజ్ చేస్తారు. వైద్య బృందాలు రంగంలోకి దిగి.. కొవిడ్-19 పేషెంట్లుగా తేలినవాళ్లు ఎక్కడెక్కడ తిరిగారో, ఎవర్ని కలిశారో తెలుసుకుంటూ అనుమానితులకు టెస్టులు నిర్వహిస్తారు. ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ విధానం ద్వారా వైరస్ వ్యాప్తిని చాలా వరకు అరికట్టగలిగినట్లు వెల్లడైంది. ఏపీలోని కర్నూలు జిల్లాను సైతం ప్రస్తుతం కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే,
Recommended Video
ఇప్పటిదాకా ఎన్ని టెస్టులంటే..
మన దేశంలో ఈ ఏడాది జనవరి 30న తొలి కరోనా కేసు వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి ఇవాళ్టిదాకా మొత్తం 1లక్ష, 7వేల ఆరు మంది అనుమానితులకు కరోనా టెస్టులు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్)కు చెందిన డాక్టర్ ఆర్.గంగా ఖేడ్కర్ చెప్పారు. దేశవ్యాప్తంగా కరోనా పరీక్షలు నిర్వహిస్తోన్న ల్యాబ్స్ లో 136 ప్రభుత్వానికి చెందినవని, 59 ప్రైవేటు ల్యాబ్స్ లోనూ పరీక్షలకు అనుమతిచ్చామని ఆయన తెలిపారు.