డేంజర్ బెల్స్: శిథిలావస్థలో ఆ వంతెనలు.. ఎప్పుడు కూలుతాయో అన్నట్లు?
దేశంలో ఉన్న సుమారు 1.60లక్షల బ్రిడ్జిలలో 100వరకు ప్రమాదకరస్థితిలో ఉన్నట్లు గుర్తించామన్నారు.
న్యూఢిల్లీ: గురువారం లోక్ సభలో శిథిలావస్థకు చేరుకున్న వంతెనల గురించి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడారు. దేశవ్యాప్తంగా సుమారు 100వంతెనలు శిథిలావస్థలో ఉన్నాయని, అవి ఏ క్షణంలోనైనా కూలిపోయే ప్రమాదం ఉందని వెల్లడించారు.
దేశంలో ఉన్న సుమారు 1.60లక్షల బ్రిడ్జిలలో 100వరకు ప్రమాదకరస్థితిలో ఉన్నట్లు గుర్తించామన్నారు. వీటి మరమ్మత్తులకు త్వరలోనే చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. మహారాష్ట్ర కొంకణ్ ప్రాంతంలోని సావిత్రి నదిపై ఉన్న బ్రిటీష్ కాలం నాటి వంతెన గతేడాది కొట్టుకుపోవడంతో రెండు బస్సులు, కొన్ని ప్రైవేటు వాహనాలు గల్లంతయ్యాయని పేర్కొన్నారు.
రోడ్డు ఆక్రమణలు, భూసేకరణ, పర్యావరణ అడ్డంకుల కారణంగా అనేక చోట్ల వంతెనల నిర్మాణంలో తీవ్ర జాప్యం జరుగుతోందని తెలియజేశారు. ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్న వంతెనల స్థానంలో కొత్తవి నిర్మించేందుకు ప్రభుత్వం రూ.3.85లక్షల కోట్ల కేటాయించిందన్నారు. అవరోధాలను అధిగమించి నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు కృషి చేస్తున్నామని అన్నారు.