శనివారం నాటికి భారత్ జనాభా 127,42,39,769
న్యూఢిల్లీ: శనివారం (11, జూలై) సాయంత్రం 5 గంటలకు మన దేశ జనాభా సరిగ్గా 127,42,39,769కి చేరింది. ఏటా 1.6 శాతం చొప్పున నమోదవుతున్న వృద్ధి కారణంగా 2050 నాటికి చైనాను అధిగమించి ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశంగా భారత్ నిలిచే అవకాశముందని జాతీయ జనాభా స్థిరీకరణ నిధి తెలిపింది.
శనివారం ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఈ గణాంకాలను ప్రకటించింది. ఇప్పటికీ ప్రపంచ జనాభాలో 17.25 శాతం జనాభా భారత్లో ఉంది. ఐదో స్థానంలో ఉన్న బ్రెజిల్ కంటే మన దేశంలోని ఉత్తర ప్రదేశ్ జనాభా సంఖ్యే ఎక్కువ.
139 కోట్ల జన సంఖ్యతో ప్రపంచంలో మొదటి స్థానంలో ఉన్న చైనా కంటే మన దేశంలో జనాభా వృద్ధి రేటు.1.63 ఎక్కువగా ఉంది. ఈ లెక్కను మన దేశ జనాభా 2050కి 163 కోట్లకు చేరుకోవచ్చు. 2013 నాటికి సంతాన సాఫల్యత 2.3గా ఉంది. ఆ సంఖ్య స్థిరంగా లేదు. వివాహమైన వయసును బట్టి పిల్లల సంఖ్య ఆధారపడింది.
2011 జనాభా లెక్కల ప్రకారం మన దేశ జనాభా 121 కోట్లు. అమెరికా, ఇండోనేషియా, బ్రెజిల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, జపాన్ దేశాల్లో ఉన్న జనసంఖ్యకు ఇది దాదాపు సమానం. రాజస్థాన్, జార్ఖండ్, బీహార్ వంటి రాష్ట్రాల్లో 21-26 శాతం మంది వధువుల వయస్సు 18 ఏళ్ల కంటే తక్కువ.