రిపబ్లిక్ డే ఏర్పాట్లలో కలకలం- పరేడ్ కోసం వచ్చిన 150 మంది సైనికులకు కరోనా ? ఈ సారి రిపబ్లిక్ డే వేడుకలపై క
ఈ సారి రిపబ్లిక్ డే వేడుకలపై కూడా కరోనా ప్రభావం పడేలా కనిపిస్తోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఎక్కడో చోట కరోనా వైరస్ ప్రభావం కనిపిస్తూనే ఉంది. తాజాగా ఢిల్లీకి చేరుకున్న వందలాది మంది సైనికుల్లో కొందరికి కరోనా ఉన్నట్లు తేలడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రిపబ్లిక్ డే కోసం ఢిల్లీ చేరుకోగానే నిర్వహించిన కరోనా పరీక్షల్లో వీరికి పాజిటివ్గా తేలింది.
రిపబ్లిక్ డే పరేడ్ కోసం వివిధ బెటాలియన్ల నుంచి, ప్రాంతాల నుంచి సైనికులు ఇక్కడికి రావడం అనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది కూడా రిపబ్లిక్ డే సందర్భంగా నిర్వహించే వివిద పరేడ్ల కోసం వేల సంఖ్యలో సైనికులు తరలివచ్చారు. కరోనా కావడంతో వీరికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఎవరికీ ఎలాంటి లక్షణాలు లేవని ముందుగా తేల్చారు. అయినా ఎందుకన్నా మంచిదని పరీక్షలు నిర్వహించగా.. ఇందులో దాదాపు 150 మందికి కరోనా వైరస్ పాజిటివ్గా తేలింది. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది.
కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారమే ఈ ఏడాది పరేడ్ నిర్వహిస్తున్నారు. ఇందుకోసం మాక్ పరేడ్లు చేయాల్సి ఉంది. ఇలాంటి సమయంలో ఒక్కసారిగా 150 మంది వరకూ కరోనా సోకడంతో తీవ్ర కలకలం రేగుతోంది. విషయం తెలియగానే వీరిని వెంటనే క్వారంటైన్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. వీరి ప్రాధమిక కాంటాక్ట్లను గుర్తించే పనిలో అధికారులు బిజీగా ఉన్నారు. ప్రతీ ఏటా రిపబ్లిక్ డేతో పాటు ఆర్మీ డే పరేడ్ల కోసం సైనికులు వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తారని, కానీ ఈసారి కరోనా ప్రభావం వల్ల ఎక్కువ మంది రాలేదని తెలుస్తోంది.