ఢిల్లీలో విద్యార్థినిపై గ్యాంగ్ రేప్: వీడియో తీశారు
గుర్గావ్: బాలికను నమ్మించి తీసుకు వెళ్లి రెండు రోజుల పాటు గదిలో నిర్బంధించి ముగ్గురు సామూహిక అత్యాచారం చేసిన సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. గ్యాంగ్ రేప్ చేస్తున్న సమయంలో వీడియో చిత్రీకరించి బ్లాక్ మెయిల్ చేశారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గుర్గావ్ లోని బాద్ షాపూర్ లో 16 సంవత్సరాల బాలిక నివాసం ఉంటున్నది. ఈమె ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నది. బాద్ షాపూర్ సమీపంలోని పాల్రా గ్రామంలో నివాసం ఉంటున్న కరణ్ సింగ్ తో బాలికకు పరిచయం ఉంది.
ఈనెల 8వ తేదిన చదువుకుంటున్న బాలికతో కరణ్ సింగ్ మాట్లాడాడు. బాలికకు మాయమాటలు చెప్పి బైక్ లో అక్కడి నుంచి పిలుచుకుని వెళ్లాడు. తరువాత ప్రయివేట్ బస్ లో బాలికను ఢిల్లీకి పిలుచుకుని వెళ్లారు.
ఢిల్లీలోని కల్కాజీ ప్రాంతంలోని గదిలో బాలికను నిర్బంధించారు. తరువాత బాలిక మీద కరణ్ సింగ్ అత్యాచారం చేశాడు. కరణ్ సింగ్ తరువాత సంజయ్ అనే నిందితుడు అత్యాచారం చేశాడు. ఆ సందర్బంలో మహేష్, కళ అనే నిందితులు వారికి సహకరించారు.
అనంతరం కళ అనే యువకుడు బాలిక మీద అత్యాచారం చేశాడు. అత్యాచారం చేస్తున్న సమయంలో వీడియో చిత్రీకరించారు. విషయం బయటకు చెబితే ఈ వీడియో బయటపెడుతామని, నిన్ను చంపేస్తామని ఆమెను బెదిరించారు.
రెండు రోజులు బాలిక మీద అత్యాచారం చేసిన నిందితులు తరువాత ఆమెను గుర్గావ్ కు పిలుచుకుని వచ్చి వదిలి పెట్టారు. బాలిక జరిగిన విషయం చెప్పడంతో ఆమె కుటుంబ సభ్యులు బాద్ షాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మొదట బాలిక మహేష్ కూడా తన మీద అత్యాచారం చేశాడని చెప్పింది. తరువాత అతను వీడియో మాత్రం తీశాడని చెబుతున్నదని పోలీసులు తెలిపారు. బాలికకు వైద్య పరిక్షలు చేయించారు. బాలిక మీద అత్యాచారం జరిగిందని వైద్యులు నిర్దారించారు.
కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలిస్తున్నామని బాద్ షాపూర్ పోలీస్ స్టేషన్ అధికారి ప్రవీణ్ మాలిక్ చెప్పారు. ఇప్పటి వరకు నలుగురు నిందితులు చిక్కకుండా తప్పించుకున్నారని పోలీసులు తెలిపారు.