మరో ఇద్దరు ఉగ్రవాదుల అరెస్ట్: భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం: దక్షిణాదిన విధ్వంసానికి కుట్ర?
కోల్ కోత: ఒకవంక దాయాది దేశం పాకిస్తాన్ తో యుద్ధ మేఘాలు కమ్ముకున్న ప్రస్తుత పరిస్థితుల్లో.. భారత్ మరోవంక ఉగ్రవాద సమస్యను ఎదుర్కొంటోంది. ఉగ్రవాదం చాపకింద నీరులా విస్తరిస్తోంది. జమ్మూకాశ్మీర్ లోని పుల్వామా జిల్లా అవంతిపురా వద్ద ఈ నెల 14వ తేదీన సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై దాడి చేసి, మారణ హోమాన్ని సృష్టించిన జైషె మహమ్మద్ సంస్థకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను కొద్దిరోజుల కిందట ఉత్తర్ ప్రదేశ్ లోని సహరాన్ పూర్ లో అరెస్టు చేశారు పోలీసులు. సరిగ్గా వారంరోజులు కూడా తిరగకముందే పశ్చిమ బెంగాల్ లో మరో ఇద్దరు ఉగ్రవాదులు అరెస్టు అయ్యారు. వారి వద్ద నుంచి భారీ ఎత్తున పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇండియన్ ముజాహిదీన్ తో సంబంధాలు
ముర్షీదాబాద్ లో పోలీసులు అరెస్టు చేసిన ఇద్దరూ పశ్చిమ బెంగాల్ వాసులు. చాలాకాలంగా ముర్షీదాబాద్ లో నివసిస్తున్నారు. మొషీబుర్ రెహ్మాన్ ఆలియాస్ ఫారూక్, రుహూల్ అమీన్ ఆలియాస్ సైఫుల్లాగా గుర్తించారు. వారిద్దరూ బంగ్లాదేశ్ ప్రధాన కేంద్రంగా అసాంఘిక కార్యకలాపాలను కొనసాగిస్తున్న జమాతుల్ ముజాహిదీన్ సభ్యులని పోలీసులు తెలిపారు. మనదేశంలో ఇండియన్ ముజాహిదీన్ తో వారిద్దరికి సంబంధాలు ఉన్నాయని పోలీసులు చెప్పారు.
పాత నేరస్తులు ఇచ్చిన సమాచారం..
ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న కౌసర్, సజ్జద్ అనే ఇద్దరు నేరస్తులతో వారు సన్నిహితంగా ఉంటున్నట్లు తేలింది. 2014లో బుర్ద్వాన్ పేలుడు కేసులో కౌసర్, సజ్జద్ అరెస్ట్ అయ్యారు. బుర్ద్వాన్ పేలుళ్లకు సూత్రధారులైన వారిద్దరూ ప్రస్తుతం కారాగారశిక్షను అనుభవిస్తున్నారు. వారు ఇచ్చిన కీలక సమాచారం ఆధారంగా మొషీబుర్ రెహ్మాన్, రుహూల్ అమీన్ లను అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు. దేశంలో అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో పేలుళ్లు జరపడానికి వారు కుట్ర పన్నినట్లు తేలిందని చెప్పారు.