తాజ్ మహల్ వద్ద అకస్మాత్తుగా వ్యాపారి కూతురు అదృశ్యం
ఆగ్రా: తాజ్ మహల్ను చూడడానికి వచ్చిన 20 ఏళ్ల యువతి అకస్మాత్తుగా కనిపించకుండా పోయింది. తన తల్లిదండ్రులతో, తమ్ముడితో కలిసి తాజ్ మహల్ చూడడానికి వచ్చి, క్యూలో నించుంది. అలా నించున్న యువతి కనిపించకుండా పోయిందని పోలీసులు సోమవారంనాడు చెప్పారు. ఆమె జాడ తెలియడం లేదని వారన్నారు.
ఆమె ముంబై రియల్టర్ ఫరూఖ్ కూతురు. సిఎ చదువుతోంది. క్యూలో నించున్న ఆ యువతి ఏమైందో తెలియక కుటుంబ సభ్యులు కలవరానికి గురవుతున్నారు. ఆమె కోసం కుటుంబ సభ్యులు ఆందోళనతో పలు చోట్ల గాలించారు. కానీ ఫలితం కనిపించలేదు.
ముంబై వ్యాపారి కూతురు అదృశ్యంపై ఏ విధమైన క్లూలు కూడా లభించడం లేదని పోలీసులు అంటున్నారు. తాము సిసిటివీ కెమెరాల సాయం తీసుకుంటున్నట్లు తెలిపారు. మాయమైన యువతి తల్లి ముంబై పీస్ కమిటీ అధ్యక్షురాలని తెలుస్తోంది.
యువతి అదృశ్యంపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆమె ఆచూకీ కనిపెట్టకపోవడం పట్ల కుటుంబ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.