నిర్భయ గ్యాంగ్రేప్: జైలులో నిందితుడి ఆత్మహత్యాయత్నం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కదులుతున్న బస్సులో నిర్భయపై అత్యంత పాశవికంగా సామూహిక అత్యాచారం (2012 డిసెంబర్ 16) చేసి ఆమె మరణానికి కారణమైన ప్రధాన నిందితుల్లో ఒకరు ఆత్మహత్యాయత్నం చేశాడు.
ఐదుగురు వ్యక్తులు ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నారు. వీరు తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. కాగా, తిహార్ జైలులో నిందితుల్లో ఒకడైన వినయ్ శర్మ అనే వ్యక్తి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. తొలుత పెయిన్ కిల్లర్స్ తీసుకొని అనంతరం టవల్తో ఉరిపెట్టుకున్నాడు.
అది గమనించిన జైలు సిబ్బంది వెంటనే అతడ్ని కాపాడి.. ఢిల్లీలోని దీన్ దయాల్ ఉపాధ్యాయ్ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. 2013 ప్రారంభంలో తనపై తిహార్ జైలులోని తోటి ఖైదీలు దాడి చేశారని తనకు అదనపు భద్రత కల్పించాలని వినయ్ శర్మ అప్పట్లో డిమాండ్ చేశాడు.
కాగా, ఈ కేసులో ఉన్న నిందితులు ఆత్మహత్యా ప్రయత్నం చేయడం ఇదే తొలిసారి కాదు. అంతకుముందే 2013 మార్చి నెలలో బస్సు డ్రైవర్ రామ్సింగ్ అనే నిందితుడు జైలులోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.