బెదిరింపుల కలకలం: ఆదివారం ఒక్కరోజే 24 విమానాలకు, 100కు చేరిక
ఇటీవల కాలంలో దేశంలో బాంబు బెదిరింపులకు గురవుతున్న విమానాల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం ఆందోళనకరమైన అంశంగా మారింది. విమానాయన సంస్థలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. బెదిరింపులు ఆగడం లేదు. ఆదివారం కూడా ఏకంగా 20కిపైగా విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ రావడం గమనార్హం. విస్తారా, ఆకాశ ఎయిర్ తోపాటు అనేక సంస్థల విమానాలకు బెదిరింపులు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
ఆదివారం ఒక్కరోజే 24 విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. వీటిలో ఆరు విమానాలు ఇండిగో విమానయాన సంస్థకు చెందినవే ఉన్నాయి. ఈ క్రమంలో అప్రమత్తమైన అధికారులు అత్యవసర తనిఖీలు చేపట్టారు. ఢిల్లీ నుంచి లండన్కు వెళ్లాల్సిన విస్తారా విమానాన్ని ఫ్రాంక్ఫర్ట్కు దారి మళ్లించారు. అక్కడే తనిఖీలు నిర్వహించి రెండు గంటల తర్వాత తిరిగి లండన్కు పంపినట్లు ఎయిర్లైన్స్ అధికారులు వెల్లడించారు.

గమ్యస్థానాలకు చేరుకున్న తర్వాత కూడా చాలా విమానాలకు బెదిరింపులు అందుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఎయిర్ ఇండియా, ఆకాశ ఎయిర్, విస్తారా, స్పైస్జెట్, స్టార్ ఎయిర్, అలయన్స్ ఎయిర్లకు చెందిన కొన్ని విమానాలకు ఇదే పరిస్థితి ఎదురైంది. బెదిరింపు కాల్స్ వ్యవహారంపై బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ(బీసీఏఎస్) ఇప్పటికే ఎయిర్ లైన్స్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించింది.
ఇలాంటి పనులు చేసే ఆకతాయిల ఆటకట్టించేందుకు కఠిన చర్యలు తీసుకునే దిశగా పౌర విమానయాన శాఖ కూడా సిద్ధిమవుతోంది. బాంబు బెదిరింపులకు పాల్పడే వారిని నో-ఫ్లై జాబితాలో చేర్చాలని చూస్తోంది. అంతేగాక, అలాంటి వారికి కఠిన శిక్షలు వేసేలా చర్యలు తీసుకోవాలని యోచిస్తోంది. చట్టాలలో మార్పులను కూడా అన్వేషిస్తోంది.
కాగా, తాజాగా 24 విమానాలకు బెదిరింపులు రావడంతో వారం రోజుల్లోనే ఇలా బెదిరింపులకు గురైన విమానాల సంఖ్య దాదాపు 100కు చేరుకోవడం గమనార్హం. శుక్ర, శనివారాల్లోనూ పలు విమానాలకు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. తన స్నేహితుడిని ఇరికించేందుకు ఓ మైనర్ బాలుడు బెదిరింపు సందేశం పండటంతో.. అతడ్ని కొద్ది రోజుల క్రితం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications