ఏపీ అయ్యప్ప స్వాముల బస్సు ఢీకొని ముగ్గురు దుర్మరణం
Sabarimala: కేరళ శబరిమల కొండలపై వెలిసిన అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తుతున్నారు. రోజూ వేలాదిమంది దర్శించుకుంటోన్నారు. డిసెంబర్ 26వ తేదీన మండలం పూజలు ముగియనున్నాయి. మకరవిళక్కు కోసం మళ్లీ 30వ తేదీన స్వామివారి ఆలయాన్ని తెరుస్తారు. ఈ 16వ తేదీన మండలం పూజల కోసం అయ్యప్ప స్వామివారి ఆలయం తెరచుకుంది. అయ్యప్ప స్వామిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 16 లక్షలు దాటింది.
భక్తులు వేల సంఖ్యలో తరలి వెళ్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటోన్నాయి. కొల్లం జిల్లా అంచల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు శబరిమల యాత్రికులతో వెళ్తున్న బస్సు.. అదుపు తప్పి అతి వేగంగా ఆటో రిక్షాను ఢీకొనడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. మృతి చెందిన ముగ్గురూ ఆటోరిక్షాలోనే ప్రయాణిస్తున్నవారే. మృతులను శృతి లక్ష్మి, జ్యోతిలక్ష్మి, డ్రైవర్ అక్షయ్ (23)గా గుర్తించారు.

అంచల్ శివార్లల్లో పునలూర్ రోడ్ లోని మావిళక్కార జంక్షన్ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు ఢీకొన్న వేగం ధాటికి ఆటో పూర్తిగా ధ్వంసమైంది. నుజ్జునుజ్జు అయింది. ఈ బస్సులో ఏపీకి చెందినదిగా అంచల్ పోలీసులు నిర్ధారించారు. ఏపీకి చెందిన అయ్యప్ప స్వాములు బస్సులో ఉన్నట్లు వెల్లడించారు. వారికి ఎలాంటి గాయాలు కాలేదు. బస్సు ఢీ కొన్న ఘటనలో తీవ్రంగా గాయాలపాలైన ముగ్గురినీ ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. రక్తస్రావం కావడం వల్ల చికిత్స పొందుతూ మరణించారు.
మృతదేహాలను పునలూర్ తాలూకా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై అంచల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అంతకుముందు కర్ణాటకలో సంభవించిన రోడ్డు ప్రమాదంలో నలుగురు అయ్యప్ప స్వాములు మరణించారు. కర్ణాటక కోలార్ జిల్లాలోని మాలూరు తాలూకా అబ్బేనహళ్లి సమీపంలో బెంగళూరు-చెన్నై ఎక్స్ప్రెస్ హైవేపై ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
ఆ తర్వాత తమిళనాడుకే చెందిన అయ్యప్ప స్వాములు ప్రయాణిస్తోన్న ప్రైవేట్ బస్సు ప్రమాదానికి గురైంది. కొల్లం-తేని జాతీయ రహదారిపై ఇడుక్కి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో 50 మంది అయ్యప్ప భక్తులు గాయపడ్డారు. వారిలో 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక, రెస్క్యూ సర్వీస్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టారు.












Click it and Unblock the Notifications