పుల్వామా ఎన్కౌంటర్: లష్కరే తొయిబా డిప్యూటీ కమాండర్తోపాటు ముగ్గురు ఉగ్రవాదుల హతం
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. పుల్వామా జిల్లాలో ఆదివారం సాయంత్రం జరిగిన ఎన్కౌంటర్లో లష్కరే తోయిబాకు డిప్యూటీ కమాండర్ ఇన్ చీఫ్ ఆరిఫ్ హజార్ సహా మరో ఇద్దరు ముష్కరులను మట్టుబెట్టాయి భద్రతా బలగాలు. మిగిలిన ఇద్దరి వివరాలు తెలియాల్సి ఉందని సైనికాధికారులు తెలిపారు.
తొలుత పుల్వామాలోని పాహు ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో తనిఖీలు చేపట్టాయి భద్రతా దళాలు. ఈ నేపథ్యంలో ముష్కరులు భద్రతా బలగాలపై కాల్పులు జరిపారు. ప్రతిఘటించిన బలగాలు.. వారికి ధీటుగా బదులిచ్చి ముగ్గురు ముష్కరులను మట్టుబెట్టాయి.
ఇది ఇలావుండగా, అంతకుముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన వేళ.. జమ్మూ బిశ్నా ప్రాంతంలోని లలియాన్ గ్రామంలో ఆదివారం పేలుడు సంభవించింది. ప్రధాని ప్రసంగించనున్న పల్లీ గ్రామానికి ఇది కేవలం 7 కిలోమీటర్ల దూరంలో జరిగింది. వ్యవసాయ క్షేత్రంలో జరిగిన ఈ పేలుడు గురించి గ్రామస్థులు సమాచారం అందించినట్లు పోలీసులు తెలిపారు. దీనిని పిడుగుపాటు లేదా ఉల్కగా అనుమానిస్తున్న పోలీసులు.. దర్యాప్తు ముమ్మరం చేశారు.
కాగా, ఆర్టికల్ 370 రద్దు అనంతరం జమ్మూకాశ్మీర్లో మోడీ పర్యటించడం ఇదే తొలిసారి. పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా దేశంలోని గ్రామ పంచాయతీలను ఉద్దేశించి సాంబాలోని పల్లీ గ్రామంలో మోడీ ప్రసంగించారు. ఈ పర్యటనలో బనిహాల్-కాజీగుండ్ సొరంగ మార్గంతో పాటు, రూ.20 వేల కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ప్రధాని పర్యటన సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.