ఛోటా నూరా కుట్ర ఇదీ: బిజెపిలో చేరి అగ్రనేతలను చంపాలని....
న్యూఢిల్లీ: ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ టాప్ కమాండర్ నూర్ మహ్మద్ తంత్రే లేదా ఛోటా నూరాను దక్షిణ కాశ్మీర్లోని పుల్వామా జిల్లాలో బుధవారం ఉదయం ఎన్కౌంటర్లో మరణించాడు. నాలుగంటే నాలుగు అడుగుల ఎత్తు మాత్రమే గల అతను పెద్ద కుట్రే చేసినట్లు తెలుస్తోంది.
బీజేపీలో చేరి ఆ పార్టీ అగ్ర నేతలను మట్టుబెట్టాలని ప్రయత్నించినట్లు వెలుగు చూసింది. కాశ్మీరులో చాలా ఉగ్రవాద దాడులకు అతను ప్రధాన సూత్రధారి. అతన్ని భద్రతా దళాలు చంపడంతో జైషే మహ్మద్కు గట్టి దెబ్బే తగిలింది. జమ్మూ-కాశ్మీరు పోలీసులు చోటా నూర్కు సంబంధించిన వివరాలు వెల్లడించారు.
అతని కుట్ర ఇదీ..
నూర్ మహ్మద్కు పీర్ బాబా అనే మారు పేరు ఉంది. అతను ట్రాల్కు చెందినవాడు. అతన్ని ఛోటా నూర్ అని కూడా అంటారు అతను 4 అడుగుల 2 అంగుళాల పొడవు ఉంటాడు. బీజేపీలో చేరి, ఆ పార్టీ అగ్ర నేతలపై నిఘా పెట్టి హతమార్చాలని కుట్ర చేశాడు.
గతంలో అతను ఇలా..
2003లో న్యూఢిల్లీలోని అశోకా రోడ్లో ఉన్న బీజేపీ కార్యాలయానికి నూర్ మహ్మద్ వెళ్లాడు. అదే ఏడాది ఢిల్లీ పోలీసు శాఖలోని ఉగ్రవాద వ్యతిరేక విభాగం నూర్తోపాటు అతని సహచరులను అరెస్టు చేసింది. వారి నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకుంది. దీంతో బీజేపీలో చేరాలనే అతని ప్రయత్నం విఫలమైంది.
అతనికి నూర్ సన్నిహితుడు..
2001లో పార్లమెంటుపై దాడి సూత్రధారి ఘాజీ బాబాకు నూర్ అత్యంత సన్నిహితుడు. 47 ఏళ్ళ నూర్ జమ్మూ-కాశ్మీరులో భద్రతా దళాలకు సవాల్గా నిలిచాడు. శ్రీనగర్ కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తూ, పెరోల్పై 2015లో విడుదలయ్యాడు. ఆ తర్వాత దక్షిణ కాశ్మీరులోని ట్రాల్లో ఉంటూ జైషే మహ్మద్ కార్యకలాపాలను విస్తరించాడు.
ఆ తర్వాత అదృశ్యం
ఈ ఏడాది జూలైలో అరిపాల్ ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమైన తర్వాత నూర్ కనిపించకుండా పోయాడు. చాలా ఉగ్రవాద దాడులకు అతను నేపథ్యంగా పనిచేశాడు. శ్రీనగర్ విమానాశ్రయం సమీపంలోని బీఎస్ఎఫ్ స్థావరం వద్ద అక్టోబరులో జరిగిన దాడికి ప్రధాన సూత్రధారి అతనే.
దాంతో ఆ దాడి కుట్ర విఫలం
జమ్మూ కాశ్మీర్ జాతీయ రహదారిపై కాన్వాయ్ మీద దాడి చేయడానికి నూర్, అతని సహచరులు తాజాగా కుట్ర చేశారు. అయితే, సకాలంలో భద్రతా బలగాలు చేరుకోవడంతో కుట్రను తిప్పికొట్టగలిగినట్లు పోలీసు డైరెక్టర్ జనరల్ ఎస్పీ వైద్ చెప్పారు. నిర్దిష్టమైన నిఘా సమాచారంతో ఆపరేషన్ చేసినట్లు తెలిపారు.