లాక్డౌన్తో భారత్లో ఆకలి కేకలు- తిండికే 45 శాతం మంది అప్పులు-దళితులు, ముస్లింలే
కరోనా వైరస్ ప్రభావంతో ఈ ఏడాది భారత్లో విధించిన లాక్డౌన్ దేశ ఆర్ధిక పరిస్దితితో పాటు సాధారణ ప్రజల రోజువారీ జీవనాన్ని కూడా తలకిందులు చేసింది. ప్రభుత్వాలు ఎలా అప్పుల కోసం పరుగులు తీస్తున్నాయో, అలాగే బడుగు, బలహీన వర్గాల ప్రజలు కూడా రోజూ కడుపు నింపుకోవడం కోసం కూడా అప్పులు చేయాల్సిన పరిస్దితి తలెత్తింది. లాక్డౌన్, లాక్డౌన్ అనంతర పరిస్ధితుల్లో దేశంలోని 11 రాష్ట్రాల్లో ప్రజలు ఆకలి కోసం పడిన ఇబ్బందులు, వారి జీవన విధానాల్లో వచ్చిన మార్పు వంటి అంశాలపై హంగర్ వాచ్ అనే సంస్ద తాజాగా నిర్వహించిన సర్వే వాస్తవ పరిస్ధితికి అద్దం పట్టేలా ఉంది.
హంగర్ వాచ్ సర్వే
కరోనా నేపథ్యంలో భారత్లో విధించిన లాక్డౌన్లో నిరుపేదలు, బలహీన వర్గాలు పడిన ఇబ్బందులపై హంగర్ వాచ్ అనే సంస్ధ తాజాగా సర్వే నిర్వహించింది. ఇందులో ఉత్తర్ప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్ధాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్ఘడ్, జార్ఖండ్, ఢిల్లీ, తెలంగాణ, తమిళనాడు, బెంగాల్లో లాక్డౌన్ తర్వాత తీవ్ర దుర్భరమైన పరిస్ధితులు తలెత్తాయని హంగర్ వాచ్ సర్వేలో తేలింది. ఆయా రాష్ట్రాల్లోని 4 వేల మందిపై నిర్వహించిన సర్వేలో ఎక్కువగా సమాజంలో బడుగు, బలహీన వర్గాల నుంచి సమాచారం సేకరించారు. ఇందులో లాక్డౌన్కు ముందు వీరి పరిస్ధితి ఎలా ఉండేది, లాక్డౌన్ విధించాక ఎలా మారిందనే అంశాన్ని ప్రత్యేకంగా అధ్యయనం చేశారు. ఈ సర్వే వారి ఆకలి కేకలు, దుర్భర పరిస్ధితులకు అద్దం పట్టింది. ఈ ఏడాది సెప్టెంబర్- అక్టోబర్ మధ్య కాలంలో జరిపిన ఈ సర్వేలో 11 రాష్ట్రాల్లో ఉన్న ప్రజల్లో ప్రతీ నలుగురిలో ఒకరు ఆకలితోనే పడుకోవాల్సిన పరిస్దితులు తలెత్తాయని సర్వే నిర్దారించింది. అలాగే లాక్డౌన్కు ముంది వీరిలో 56 శాతం మంది ఆకలి ఇబ్బందులు లేకుండా జీవిస్తే లాక్డౌన్ తర్వాత మాత్రం వీరిలో ప్రతీ ఏడుగురిలో ఒకరు ఆకలి పడుకోవాల్సిన పరిస్దితి తలెత్తింది.
దళితులు, ముస్లింలే బాధితులు..
లాక్డౌన్ ప్రారంభం అయినప్పటి నుంచి దేశవ్యాప్తంగా నలుగురు దళితుల్లో ఒకరు, నలుగురు ముస్లింలలో ఒకరు ఆకలితో బాధపడినట్లు హంగర్ వాచ్ సర్వే తెలిపింది. దళితులు, ముస్లింలు మినహా మిగిలిన వర్గాల్లో మాత్రం ప్రతీ పదిమందిలో ఒకరు ఆకలి కేకలతో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు సర్వే నివేదిక తేల్చింది. భారత్లో లాక్డౌన్ తర్వాత 11 రాష్ట్రాల్లో తీవ్ర దుర్భర పరిస్ధితులు ఎదురయ్యాయని హంగర్ వాచ్ సంస్ద నిర్వహించిన సర్వేలో తేలింది. ఈ 11 రాష్ట్రాల్లో దాదాపు 45 శాతం మంది ప్రజలు ఆర్ధికంగా తీవ్రంగా ప్రభావితం అయ్యారని, వారు తిండి కోసమే అప్పులు చేయాల్సిన పరిస్ధితి వచ్చిందన్నారు. లాక్డౌన్ కంటే ముందున్న పరిస్ధితితో పోలిస్తే వీరి పరిస్ధితి దుర్భరంగా మారిందని సర్వే తెలిపింది. జనరల్ కేటగిరిలో ఉన్న వారితో పోలిస్తే దళితుల్లో ఇలా తిండి కోసం అప్పులు చేయాల్సిన పరిస్ధితి 23 శాతం ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. ఈ లెక్కన చూస్త సుమారు 74 శాతం దళితుల ఆహార వినియోగం పరిమాణం తగ్గిందని ‘హంగర్ వాచ్' పేర్కొంది.
పడిపోయిన ఆదాయాలతో విలవిల...
లాక్డౌన్, తదనంతర పరిస్ధితుల్లో చాలా రాష్ట్రాల్లో ప్రజల ఆదాయాలు భారీగా పడిపోయాయి. ముఖ్యంగా సర్వేల్లో పాల్గొన్న వారిలో 43 శాతం మంది ఏప్రిల్-మే నెలల్లో తమకు ఎలాంటి ఆదాయం లేదని తెలిపారు. వీరిలో కేవలం 3 శాతం మందే తిరిగి లాక్డౌన్కు ముందున్న పరిస్ధితికి చేరుకున్నారు. అలాగే ఈ సర్వేలో 11 రాష్ట్రాల్లో ప్రజలు తినే ఆహార పరిమాణం కూడా 66 శాతం తగ్గిపోయిందని నివేదిక తెలిపింది. జార్ఖండ్లో 82 శాతం, ఢిల్లీలో 81 శాతం, రాజస్దాన్లో 80 శాతం ఆహార పరిమాణాల్లో తగ్గుదల కనిపించింది. ఛత్తీస్ఘడ్ వంటి రాష్ట్రాల్లో అయితే వారి పౌష్ఠికాహార నాణ్యత 90 శాతం పడిపోయింది.
పేదల్ని ఆదుకోవాలని ప్రభుత్వాలకు సూచన
ప్రస్తుతం దేశవ్యాప్తంగా వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళన పలు రాష్ట్రాల్లో ఆకలి కేకలకు కారణం కానుందని కూడా ఈ సర్వే అంచనా వేసింది. వ్యవసాయ చట్టాల ప్రభావం రైతులు తీవ్రంగా ఉంటుందని, వారు ఇప్పటికే ఆందోళనల్లో తీరిక లేకుండా ఉండటంతో ఆ మేరకు ప్రజా పంపిణీ వ్యవస్ధపైనా పెను ప్రభావం పడుతుందని సర్వే పేర్కొంది. దీంతో లక్షలాది మంది జనానికి ఆకలి తప్పదని తెలిపింది. ప్రస్తుత పరిస్ధితుల్లో ఆయా రాష్ట్రాల్లోని బాధితుల్లో ప్రతీ ఒక్కొక్కరికి నెలకు పది కిలోల బియ్యం, కిలోన్నర పప్పులు, 800 గ్రాముల నూనెను కనీసం ఆరునెలల పాటు ఇవ్వాలని ఈ సర్వే సూచించింది. అలాగే ప్రతీ ఇంటికీ కనీసం 200 రోజుల ఉపాధి హామీ పథకాన్ని వర్తింపజేయాలని ప్రభుత్వాలకు సూచించింది.