జహంగీర్ పురీ కేసు-జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టైన ఐదుగురికి 8 రోజుల కస్టడీ
దేశ రాజధాని ఢిల్లీలో చెలరేగిన జహంగీర్ పురి మతఘర్షణల కేసు ఇవాళ మరో మలుపు తిరిగింది. ఈ కేసులో నిందితులుగా భావిస్తూ జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టు చేసిన ఐదుగురికి కోర్టు ఎనిమిది రోజుల పోలీసు కస్టడీకి అనుమతించింది. వీరితో పాటు మరో నలుగురికి జైలుకు పంపింది.
జహంగీర్పురి హింసాత్మక ఘటనలో ఐదుగురు ప్రధాన నిందితులను ఢిల్లీ కోర్టు ఎనిమిది రోజుల పోలీసు కస్టడీకి పంపగా, ఈ కేసులో మరో నలుగురిని 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.ఐదుగురు నిందితులు అన్సార్, సలీం, దిల్షాద్, సోనూ, అహిర్లపై జాతీయ భద్రతా చట్టం కింద అభియోగాలు మోపారు. ఇవాళ పోలీసులు మొత్తం తొమ్మిది మంది నిందితులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఢిల్లీలోని రోహిణి కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ అంశం చాలా సున్నితమైనదని, కుట్రలో ప్రమేయం ఉన్న ఇతర నిందితులను గుర్తించేందుకు తదుపరి దర్యాప్తు చేయాల్సి ఉందని క్రైమ్ బ్రాంచ్ కోర్టుకు తెలిపింది.
విచారణలో నిందితులను పశ్చిమ బెంగాల్, ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని క్రైమ్ బ్రాంచ్ కోర్టుకు తెలిపింది.దీంతో నిందితులను ఎనిమిది రోజుల రిమాండ్ ఇవ్వాలని పోలీసులు కోరారు. ఎన్ఎస్ఏ కింద అరెస్టు చేసిన ఐదుగురు నిందితులను కోర్టు ఎనిమిది రోజుల పోలీసు రిమాండ్కు పంపగా, మిగిలిన నలుగురు నిందితులను జ్యుడీషియల్ కస్టడీకి పంపారు.దీంతో ఈ కేసులో తదుపరి దర్యాప్తు ప్రాధాన్యం సంతరించుకుంది. ఇఫ్పటికే జహంగీర్ పురి హింస, ఆ తర్వాత పరిణామాలు రాజకీయ రంగు పులుముకున్న నేపథ్యంలో పోలీసుల దర్యాప్తుపైనా ఉత్కంఠ నెలకొంటోంది.