హైదరాబాద్ నుంచి తరలివెళ్తూ: వలస కార్మికుల దుర్మరణం: మామిడిపండ్ల లోడుతో వెళ్తోన్న లారీ బోల్తా
భోపాల్: లాక్డౌన్ వల్ల జీవనోపాధిని కోల్పోయి.. స్వస్థలాలకు తిరుగుముఖం పట్టిన వలస కార్మికులు వరుసగా మృత్యువాత పడుతున్నారు. మొన్నటికి మొన్న మహారాష్ట్రలో గూడ్స్ బండి దూసుకెళ్లడంతో 15 మంది వలస కార్మికులు దుర్మరణం పాలయ్యారు. ఈ దుర్ఘటన చోటు చేసుకున్న మూడోరోజే మరో ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో అయిదుమంది వలస కార్మికులు మరణించారు. 11 మంది గాయపడ్డారు. వారంతా హైదరాబాద్ నుంచి స్వస్థలాలకు బయలుదేరిన వలస కార్మికులే.
Recommended Video
లాక్డౌన్ ప్రభావం వల్ల ఉపాధిని కోల్పోయిన వేలాది మంది వలస కార్మికులు హైదరాబాద్ నుంచి స్వస్థలాలకు తిరుగు ప్రయాణం అవుతున్నారు. వారిలో చాలామంది ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు ఉన్నారు. ఉత్తర ప్రదేశ్కు చెందిన 18 వలస కార్మికులు హైదరాబాద్ నుంచి మామిడి పండ్ల లోడుతో బయలుదేరిన లారీ ఎక్కారు. శనివారం ఉదయం బయలుదేరిన ఈ లారీ ఉత్తర ప్రదేశ్లోని ఆగ్రాకు వెళ్లాల్సి ఉంది.

మార్గమధ్యలో ఈ లారీ మధ్యప్రదేశ్లోని నర్సింగ్పూర్ జిల్లా పథా గ్రామం సమీపంలో జాతీయ రహదారిపై బోల్తా పడింది. ఈ ఘటనలో మామిడిపండ్ల లోడుపై కూర్చుని ప్రయాణం సాగిస్తోన్న వలస కార్మికులు రోడ్డు మీద చెల్లాచెదురుగా పడ్డారు. వారిలో అయిదుమంది సంఘటనా స్థలంలోనే దుర్మరణం పాలయ్యారు. మిగిలిన వారు గాయపడ్డారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న వెంటనే నర్సింగ్పూర్ జిల్లా కలెక్టర్ దీపక్ సక్సేనా, స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో హుటాహుటిన జబల్పూర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. గాయపడ్డ వారితో మృతదేహాల నుంచి శాంపిళ్లను సేకరించారు. కరోనా వైద్య పరీక్షలను నిర్వహిస్తామని దీపక్ సక్సేనా తెలిపారు.












Click it and Unblock the Notifications