ఇసుక అక్రమ రవాణా: 56 గాడిదల అరెస్ట్!
ముంబై: ఇసుక అక్రమ రవాణాపై మహారాష్ట్ర ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతోంది. అది ఏ స్థాయిలో ఉందంటే.. ఇసుక అక్రమ రవాణాకు సహకరిస్తున్నాయని 56 గాడిదలపై కేసు నమోదు చేశారు. అంతేగాక, వాటిని అరెస్ట్ చేసి కాగారానికి తరలించారు.
పంధర్పూర్లోని చంద్రభాగ నదిలో ఇసుక అక్రమంగా గాడిదలపై తరలిస్తున్న నేపథ్యంలో పోలీసులు గాడిదలను కూడా అరెస్ట్ చేశారు. కాగా, అక్రమ రవాణాను ప్రభుత్వం ఉపేక్షించదని రెవెన్యూ మంత్రి ఏకనాథ్ ఖడ్సే అసెంబ్లీలో వివరించారు. ఈ సందర్భంలోనే గాడిదలను కూడా అరెస్ట్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
అసెంబ్లీలో ఇసుక మాఫియాపై వాడివేడిగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు పేర్కొంటూ ‘ఇసుక మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. ఇసుక సంచులను తీసుకెళ్తున్న 56 గాడిదలను కూడా అరెస్ట్ చేశాం. వాటిని ప్రభుత్వ ఆవాసంలో ఉంచాం' అని ఏకనాథ్ చెప్పారు.
కాగా, ఎన్సీపి ఎమ్మెల్యే దిలీప్ సోపాల్ మాట్లాడుతూ.. ఆ గాడిదలను ప్రభుత్వం జాగ్రత్తగా చూసుకోవాలని కోరారు. ‘ఆ గాడిదలకు అవి ఏం మోసుకుపోతున్నాయో తెలియదు. అది బంగారం లేక ఇసుక అనే విషయం కూడా ఆ గాడిదలకు తెలియదు. ప్రభుత్వం ఆ గాడిదలకు మంచి ఆహారం, వసతి కల్పించాలి' అని సోపాల్ కోరారు. దీంతో సభలో నవ్వులు పూశాయి.
సోపాల్ వ్యాఖ్యలకు మంత్రి ఖడ్సే సమాధానమిస్తూ.. ‘ఆ గాడిదలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని ఆదేశాలు జారీ చేశాం. వాటి యజమానులు వాటి కోసం రాకుంటే.. వారి వద్దకే తాము వెళతాం' అని చెప్పారు.