68 మంది సీబీఐ అధికారులకు కరోనా.. ఎక్కడంటే
కరోనా కేసులు భారీగా వస్తున్నాయి. ఈ నెల ఆఖరు.. ఫిబ్రవరిలో భారీగా వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రముఖులను కూడా కేసులు వదలడం లేదు. హెల్త్ వర్కర్లు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లకు కరోనా సోకుతుంది. ఇటు ముంబై బాంద్రా - కుర్లా కాంప్లెక్స్ కార్యాలయంలో పనిచేస్తోన్న 68 మంది సీబీఐ ఉద్యోగులకు కరోనా వైరస్ సోకినట్లు సీబీఐ అధికారి ఒకరు తెలిపారు.
బీకేసీ కార్యాలయంలో పనిచేస్తున్న 235 మంది సిబ్బందికి పరీక్షలు నిర్వహించాలని. సీబీఐ బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ను కోరగా.. వారు పరీక్షలు నిర్వహించారు. 235 మంది సిబ్బందిలో అధికారులతో సహా, 68 మందికి పాజిటివ్ నిర్దారణ అయ్యారని వివరించారు. కరోనా సోకిన వారిని హోమ్ క్వారంటైన్కు పంపినట్లు వివరించారు.
మహారాష్ట్రలో కరోనా తీవ్రత అధికంగా ఉంది. శుక్రవారం 20, 971 కరోనా కేసులు నమోదయ్యాయి. శనివారం ఈ సంఖ్య క్రాస్ అవుతుందని అధికారులు చెబుతున్నారు. దేశంలో నమోదవుతున్న కరోనా కేసుల్లో 20 శాతానికిపైగా కేసులు మహారాష్ట్రలోనే నమోదవుతున్నాయి. కేసుల తీవ్రత అధికంగా ఉండటంతో ప్రభుత్వం లాక్డౌన్ విధించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే మహారాష్ట్రలో కర్ఫ్యూ నడుస్తోంది. రాష్ట్రప్రభుత్వం వారం క్రితమే నైట్ కర్ఫ్యూ అమలు చేసిన సంగతి తెలిసిందే.
ఇటు కేసులు పెరుగుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. అందుకు తగిన జాగ్రత్తలను తీసుకుంటుంది. ఆస్పత్రుల్లో అన్ని రకాల సౌకర్యాలు, మందులు అందుబాటులో ఉంచాలని అధికారులకు స్పష్టంచేసింది. కోవిడ్ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తేల్చిచెప్పింది. ఒమిక్రాన్ వైరస్ వాయువేగంతో వ్యాపిస్తోంది. ఒకరికి సోకితే.. ఆ ఫ్యామిలీకి దాదాపుగా వస్తోంది. సన్నిహితంగా మెలిగితే చాలు వైరస్ వస్తోంది.