వర్ష బీభత్సంతో డ్రైనేజీలో పడి బాలుడి మృతి.. వారంలో మూడో ఘటన
ముంబై : భారీ వర్షాలు, ఆపై వరదతో ముంబై మహానగరం ఉక్కిరిబిక్కిరవుతోంది. గల్లీలో నీరు చేరి నదీని తలపిస్తున్నాయి. ఇక లోతట్టు ప్రాంతాలు, స్లమ్ ఏరియాల గురించి చెప్పక్కర్లేదు. కానీ బస్తీలో ఉండే వారి పరిస్థితి దారుణంగా మారింది. ఓపెన్ డ్రైనేజీతో కొన్నిచోట్ల అందులో పడి చిన్నారులు చనిపోతున్నారు. తాజాగా ఏడేళ్ల బాలుడు కూడా మృతిచెందాడు. అయితే వారంలో ఇది మూడో ఘటన కావడం ఆందోళన కలిగిస్తోంది. మరో ఇద్దరు చిన్నారులు కూడా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.
చూస్తుండగానే ..
ముంబైలోని బస్తీ ధారావిలో పేదలు నివసిస్తుంటారు. అయితే భారీ వర్షాలతో అక్కడ ఉండేవారు ఇబ్బంది పడుతున్నారు. రాజీవ్ గాంధీ కాలనీకి చెందిన ఏడేళ్ల బాలుడు ఓపెన్ డ్రైనేజీలో పడిపోయాడు. వెంటనే స్థానికులు పోలీసలకు సమాచారం అందించారు. వారు వెంటనే బాలుడిని డ్రైనేజీ నుంచి వెలికితీశారు. వెంటనే సమీపంలోని సియోన్ ఆస్పత్రికి తరలించారు. కానీ ప్రయోజనం లేకపోయింది. బాలుడు చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు.

ఏడేళ్ల బాలుడు ఇలా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోగా .. గోరెగావ్లో ఏడాదిన్నర దివ్యాంశ్ అనే బాలుడు పడిపోయాడు. భారీ వర్షానికి సమీపంలోని డ్రైనేజీలోకి కొట్టుకుపోయాడు. వెంటనే కుటుంబసభ్యులు గుర్తించి .. సహాయక చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది. పోలీసులు, బీఎంసీ వర్గాలు సహాయక చర్యలు చేపట్టినా చిన్నారి మృతదేహాన్ని వెలికితీయలేకపోయారు. బాలుడు అరేబియా సముద్రంలోకి కొట్టుకుపోయారని భావిస్తున్నారు. మరోవైపు కొద్దిరోజుల క్రితం ..12 ఏళ్ల బాలుడు కూడా వర్లిలోని డ్రైనేజీలో పడిపోయాడు. అతనిని వెలికితీసిన ప్రయోజనం లేకపోయిందని అధికారులు చెప్పారు.












Click it and Unblock the Notifications