గుడ్ న్యూస్: 8.5 శాతం వడ్డీ.. ఆర్థికశాఖ ఆమోదం
పీఎఫ్ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందజేసింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఉద్యోగుల భవిష్యనిధిపై 8.5 శాతం వడ్డీ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీనిపై త్వరలో నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్పై 8.5 శాతం చొప్పున వడ్డీ జమ చేయాలని ఈ ఏడాది మార్చిలో ఈపీఎఫ్వో నిర్ణయ మండలి కేంద్ర ట్రస్టీల బోర్డుకు ప్రతిపాదించింది. ఇందుకు కార్మిక శాఖ కూడా ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదనకు కేంద్ర ఆర్థికశాఖ నుంచి ఆమోదం లభించినట్లు ఆ వర్గాలు తెలిపాయి.
5 కోట్లకు పైగా ఈపీఎఫ్ చందాదారులకు త్వరలోనే ఈ వడ్డీని జమ చేసే అవకాశాలు ఉన్నాయి. పీఎఫ్పై 8.5 శాతం వడ్డీరేటు.. గత ఏడేళ్లలో ఇదే తక్కువ కావడం గమనార్హం. 2018-19, 2016-17లో 8.65 శాతం చొప్పున వడ్డీ జమ చేయగా.. 2013-14, 2014-15లో 8.75 శాతం చొప్పున ఇచ్చారు. 2015-16లో 8.8 శాతం చొప్పున జమచేశారు. కొవిడ్ సమయంలో విత్డ్రా పెరగడం, ఖాతాదారుల నుంచి జమయ్యే సొమ్ము తగ్గిపోవడంతో 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఈ వడ్డీని 8.5 శాతానికి తగ్గించారు.
ఈపీఎఫ్ ఖాతా కలిగిన ప్రతీ చందాదారుడు తమ ఖాతాలోని బ్యాలెన్స్ను ఎస్ఎంఎస్, మిస్డ్ కాల్ ద్వారా తెలుసుకోవచ్చు. ఒక చిన్న SMS పంపడం ద్వారా EPF ఖాతా బ్యాలెన్స్ను చెక్ చేయవచ్చు. "EPFOHO UAN ENG" అని టైపు చేసి 7738299899కు ఎస్ఎమ్ఎస్ పంపాలని కోరారు. పీఎఫ్ ఖాతాకు లింక్ అయిన మొబైల్ నెంబర్కు పీఎఫ్ ఖాతా బ్యాలెన్స్ వివరాలతో కూడిన ఒక ఎస్ఎంఎస్ మీకు వస్తుంది. సింపుల్ గా ఒక మిస్డ్ కాల్ ద్వారా కూడా పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. పీఎఫ్ అకౌంట్కు ఏ మొబైల్ నంబర్ లింక్ అయి ఉందో దాని నుంచి 011-22901406 కు మిస్డ్ కాల్ ఇస్తే సరిపోతుంది.
Recommended Video
కొన్ని సెకన్ల తర్వాత మన పీఎఫ్ ఖాతాలో బ్యాలెన్స్ ఎంత ఉందో మెసేజ్ రూపంలో వచ్చేస్తుంది. ఈ సౌకర్యం కెవైసీ పూర్తి చేసుకున్న చందాదారులకు మాత్రమే వర్తిస్తుంది. పీఎఫ్ఓ మెంబర్ పాస్ బుక్ పోర్టల్ passbook.epfindia.gov.in/MemberPassBook/Loginలో UAN నెంబర్, పాస్ వర్డ్ ఎంటర్ చేయడం ద్వారా మీ పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. ఈ సేవలను పొందడానికి యూఏఎన్ నంబర్తో అనుసంధానమైన మొబైల్ నంబర్నే వాడాల్సి ఉంటుంది