విద్యార్థినిపై రేప్: అర్దరాత్రి నిప్పంటించాడు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ సమీపంలో దారుణం జరిగింది. బాలిక మీద అత్యాచారం చేసిన కామాంధుడు విషయం బయటకు చెబుతుందనే కారణంలో సజీవదహనం చెయ్యడానికి ప్రయత్నించిన సంఘటన జరిగింది. 95 శాతం కాలిపోయిన బాలిక ఐసీయులో చావుబ్రతుకులతో పోరాడుతున్నది.
ఢిల్లీ శివార్లలోని నోయిడాలో (15) ఏళ్ల బాలిక నివాసం ఉంటూ స్థానిక స్కూల్లో చదువుకుంటున్నది. సోమవారం అర్దరాత్రి సమయంలో మేడ మీద అరుపులు, కేకలు వినిపించడంతో బాలిక కుటుంబ సభ్యులు వెళ్లి చూశారు. బాలిక మంటల్లో కాలిపోతున్నది. మంటలు అదుపు చేసి బాలికను రక్షించడానికి ప్రయత్నించారు.
తరువాత కుటుంబ సభ్యులు బాలికను ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాలిక మీద అత్యాచారం చేసి నిప్పటించాడని ఆరోపిస్తూ పోలీసులు (20) ఏళ్ల వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. 20 ఏళ్ల యువకుడు వేదిస్తుండటంతో తమ కుమార్తె స్కూలుకు వెళ్లడం మానేసిందని కుటుంబ సభ్యులు పోలీసులకు చెప్పారు.
బాలికకు మెరుగైన చికిత్స అందిస్తున్నామని ఢిల్లీలోని సపర్జంగ్ ఆసుపత్రి వైద్యులు అంటున్నారు. అయితే బాలిక బ్రతికే అవకాశాలు చాల తక్కువగా ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. బాలిక మీద అత్యాచారం చేసి హత్య చెయ్యడానికి ప్రయత్నించిన యువకుడిని పోలీసులు తమదైన శైలిలో విచారణ చేస్తున్నారు.