ఉగ్రదాడికి ప్లాన్: శ్రీనగర్లో ఐదుగురు అరెస్టు
శ్రీనగర్: గణతంత్ర దినోత్సవం రోజు దాడులు చెయ్యడానికి ప్రయత్నిస్తున్న ఐదుగురు ఉగ్రవాదులను జమ్మూ కాశ్మీర్ లో భద్రతా దళాలు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. హర్కత్- ఉల్- ముజాహిద్దీన్ ఉగ్రవాదులను శనివారం అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.
గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్బంగా ఉగ్రవాదులు దేశ వ్యాప్తంగా దాడులు చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారని ఇంటిలిజెన్స్ అధికారులు హెచ్చరించిన విషయం తెలిసిందే. శుక్రవారం వేకువ జామున నుంచి దేశ వ్యాప్తంగా అనేక చోట్ల ఉగ్రవాదులతో లింక్ ఉన్న వారిని అరెస్టు చేశారు.
గణతంత్ర దినోత్సవం దగ్గర పడుతుంటే దేశ వ్యాప్తంగా ఉగ్రవాదుల ఉనికి ఉందని తెలుసుకున్న భద్రతా దళాలు అలర్ట్ అయ్యాయి. కాశ్మీర్ లోని బారాముల్లా జిల్లాలోని సొపోర్ ప్రాంతంలో తలదాచుకుని దాడులు చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారని అధికారులు గుర్తించారు.
హర్కత్- ఉల్- ముజాహిద్దీన్ సంస్థకు చెందిన ఐదుగురిని అరెస్టు చేసి వారి నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని శనివారం భద్రతా దళాల అధికారులు తెలిపారు. ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాల్లో 14 మంది ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.