నెల క్రితం మిస్సయిన కుటుంబం, పదడుగుల లోతులో అస్థిపంజరాలుగా .. మిస్టరీ మర్డర్స్ వెనుక షాకింగ్ నిజాలు
ఒక ప్రేమ వ్యవహారం ఐదు నిండు ప్రాణాలను నిలువునా తీసింది. ఒక యువతిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసి చివరకు వేరే మహిళతో పెళ్లికి సిద్ధపడిన లవర్ కు గుణపాఠం నేర్పాలని, అతనిని పెళ్లి చేసుకోనున్న యువతి ఫోటోలు, ఫోన్ నెంబర్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది అని తెలుసుకుని పక్కా ప్లాన్ ప్రకారం ఆమెతో పాటు ఆమె కుటుంబ సభ్యులను హతమార్చాడు. వారందరినీ ఒక పొలంలో పది అడుగుల లోతులో గొయ్యి తీసి పాతి పెట్టాడు. ఒళ్ళు గగుర్పొడిచే క్రైమ్ కథా చిత్రాన్ని తలపించిన ఈ దారుణం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.
మిస్సింగ్ కుటుంబం కేసు .. అస్థిపంజరాలను వెలికితీసిన పోలీసులు
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మే 13 నుండి కనిపించకుండా పోయిన ఒక కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తుల కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు, తాజాగా మధ్యప్రదేశ్లోని దేవాస్ జిల్లాలోని వ్యవసాయ క్షేత్రం నుండి వారి అస్థిపంజరాలను బయటకు తీశారు. జెసిబి ని ఉపయోగించి మృతదేహాలను పోలీసులు వెలికితీశారు. ఐదుగురిని గొంతు కోసి చంపి ముందుగానే తవ్విన 10 అడుగుల లోతు గొయ్యిలో పడేసి, పూడ్చి పెట్టారని పోలీసులు చెప్తున్నారు.
రూపాలి ప్రేమాయణం ప్రాణాలు తీసింది
అసలు ఈ కేసు విషయానికి వస్తే సురేంద్ర అనే వ్యక్తికి రూపాలి అనే యువతితో ప్రేమాయణం సాగించాడు. తనను ప్రేమిస్తున్నానని చెప్పి, తనను కాకుండా అతను వేరొకరిని వివాహం చేసుకోబోతున్నాడని తెలిసిన రూపాలి దానిని వ్యతిరేకించింది. ఒక సోషల్ నెట్వర్కింగ్ సైట్లో సురేంద్ర కాబోయే భార్య ఫోటోతో పాటుగా, ఫోన్ నెంబర్ ను పోస్ట్ చేసింది. ఇది సురేంద్రకు కోపం తెప్పించింది . అతని పెళ్లిని చెడగొట్టడానికి రూపాలి ప్రయత్నిస్తోందని భావించిన సురేంద్ర ఆమెను, ఆమె కుటుంబ సభ్యులను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా రూపాలిని ఆమె కుటుంబ సభ్యులను తనతో మాట్లాడేందుకు రావాలని ఆమె సోదరుడు పవన్ ద్వారా కబురు పంపాడు.
ఐదుగురిని హతమార్చిన రూపాలి ప్రియుడు సురేంద్ర
వారు రావడానికి ముందే పది అడుగుల లోతు పోయి తవ్వించి, వచ్చిన తర్వాత వారందరినీ హతమార్చి ఆ గొయ్యిలో పూడ్చి పెట్టాడు. మమతా బాయి కాస్తే (45), ఆమె కుమార్తెలు రూపాలి (21), దివ్య (14) తో పాటు బంధువులు పూజా ఓస్వాల్ (15), పవన్ ఓస్వాల్ (14) ల ప్రాణాలు నిలువునా తీశాడు. ఇక వీరంతా నేమవర్ పట్టణంలోని తమ ఇంటి నుంచి కనిపించకుండా పోయారని పోలీసులకు బంధువులు ఫిర్యాదు చేయడంతో వారిని కనిపెట్టడానికి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు అసలు వ్యవహారం తెలిసి షాక్ అయ్యారు.
పోలీసులను తప్పు దారి పట్టించే స్కెచ్ కూడా
పోలీసులను తప్పుదారి పట్టించే క్రమంలో సదరు నిందితుడు రూపాలి ఐడి ద్వారా సోషల్ మీడియా సైట్లలో సందేశాలను పోస్ట్ చేసి తాను వేరే వ్యక్తిని పెళ్లి చేసుకున్నానని, వేరేచోట ఉంటున్నామని, తమ కుటుంబ సభ్యులంతా తనతోనే ఉన్నారని శతవిధాల ప్రయత్నించాడు. అయితే రూపాలి ఫోన్ రికార్డుల ఆధారంగా ఆమె ఎక్కువసార్లు సురేంద్ర చౌహాన్ కు ఫోన్ చేసి మాట్లాడిందని గుర్తించిన పోలీసులు సురేంద్రను అదుపులోకి తీసుకొని విచారించగా రూపాలితో తనకున్న సంబంధంపై పోలీసులు ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానం ఇవ్వకుండా తప్పించుకున్నాడు. తనకు వాళ్లతో సంబంధమే లేదని గట్టిగా చెప్పాడు.
పదడుగుల లోతులో మృతదేహాల ఖననం ..ఆరుగురి అరెస్ట్ ..
అయితే అనుమానం వచ్చిన పోలీసులు మే 13వ తేదీన అతను మరో ఐదుగురితో మాట్లాడినట్టు గుర్తించిన పోలీసులు వారందరినీ విడివిడిగా ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. దీంతో ఈ కేసుకు సంబంధించి ఆరుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు రూపాలి కుటుంబ సభ్యులు ఐదుగురిని సురేంద్ర చంపేసి పది అడుగుల లోతు గోతిలో మృతదేహాలను ఖననం చేశాడని గుర్తించారు. నిందితులు మృతదేహాలను ఉప్పు మరియు యూరియాతో ఖననం చేశారని పోలీసులు వెల్లడించారు.
నిందితుల అరెస్ట్ .. కేసు దర్యాప్తు
ఇక ఈ హత్యలలో సురేంద్ర కు మరో ఐదుగురు సహకారం అందించారని గుర్తించిన పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. మృతదేహాలను వెలికి తీసిన వ్యవసాయ క్షేత్రం సురేంద్ర చౌహాన్ కు చెందినది . సురేంద్ర కు సహకరించిన ఇతర నిందితుల్లో అతని తమ్ముడు, ఇద్దరు స్నేహితులు మరియు ఈ క్షేత్రంలో పనిచేసిన ఇద్దరు కార్మికులు ఉన్నారు. వ్యవసాయ భూమి నుండి అస్థిపంజరాలను వెలికి తీసిన పోలీసులు ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.