దూసుకెళ్తున్న రాందేవ్ 'పతంజలి', పోటీదార్లు కుదేలు
ఢిల్లీ: యోగా గురువు రాందేవ్ బాబా యోగా నుంచి వ్యాపారవేత్తగా దూసుకుపోతున్నారు! ఏటా పతంజలి ఉత్పత్తులను వినియోగదారులు అంతకు అంతకు ఉపయోగిస్తున్నారు. దీంతో బడా కంపెనీలు కుదేలు అవుతున్నాయి. ఓ వైపు పతంజలి ఉత్పత్తులు దూకుడుగా వెళ్తుండగా, పెద్ద కంపెనీల షేర్లు పడిపోతున్నాయి.
పతంజలి ఉత్పత్తులకు రాందేవ్ బాబా పేరే ఓ బ్రాండ్. ఈ ఏడాది రెట్టింపు దిశగా ఆదాయం పరుగులు తీస్తోంది. 2019-20 నాటికి రూ.20వేల కోట్ల వరకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. సాధారణంగా బ్రాండ్ పేరు ఉపయోగపడుతుంది. కానీ పతంజలి ఉత్పత్తులకు రాందేవ్ బాబానే ఓ బ్రాండ్.
గత ఏడాది రూ.2,500 కోట్ల దాకా టర్నోవర్ సాధించిన పతంజలి కంపెనీ వచ్చే ఏడాది అంతకు రెండింతలై రూ.5,000 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతమున్న ఎఫ్ఎమ్సీజీ కంపెనీలకు రానున్న కాలంలో గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉందంటున్నారు.
ఎఫ్ఎమ్సీజీ మార్కెట్లో నిలదొక్కుకోవాలంటే.. ముందు నుంచీ ఆ బ్రాండ్కు చరిత్ర ఉండాలి. సమాజంలో చొచ్చుకుని పోవాలి. కోట్ల కొద్దీ రూపాయలను ప్రకటనలకు వెచ్చించాల్సి ఉంటుంది. అన్నిటికి మించి బహుళ జాతి బ్రాండ్ అయి ఉండాలి. హరిద్వార్లో ప్రధాన కార్యాలయం ఉన్న పతంజలి తీరే వేరు.
వినియోగదారులకు ఆయుర్వేదిక్తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రాచీన సంప్రదాయంతో మిళితం చేసింది. ఆరోగ్యం, స్వచ్ఛత, రసాయనాలు లేని, శాఖాహార ఉత్పత్తులతో మనసులను చూరగొంది. అందుకే అది దూసుకు పోతుందంటున్నారు.
ఇతర పోటీ కంపెనీలతో పోలిస్తే 20-30 శాతం చౌకగా ఉండడం, ఇతర కంపెనీలు వ్యయాల్లో మార్కెటింగ్పై 10-14 శాతమే ఖర్చు చేస్తున్న చోట ఎనిమిది శాతమే ఖర్చు చేస్తుండడం కూడా ఈ కంపెనీ ముందు నిలవడానికి ఉపకరిస్తోంది. పతంజలి టర్నోవర్ 2011-12లో రూ.450 కోట్లు ఉంటే, ఏటకు ఏటా పెరుగుతోంది. 2014-15లో రూ.2,500 కోట్లు ఉంది. ఈ ఏడాది డబుల్ కానుందని అంటున్నారు.