మోడీ మానియా: బిజెపికి 210, కాంగ్కు 81, కేజ్రీకి 11
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల ముందు ఏ సర్వే చూసినా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగానే ఉంది. సి వోటర్, ఇండియా టుడే - నీల్సన్ సర్వేల్లో బిజెపి రెండు వందల సీట్ల వరకు వస్తాయని తేలింది. తాజాగా ఎబిపి-నీల్సన్ సర్వేలోను బిజెపికి 210, కాంగ్రెసుకు 81 సీట్లు వస్తాయని తేలిందట.
వచ్చే లోకసభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకొని అతిపెద్ద పార్టీగా బిజెపి అవతరిస్తుందని ఆ సర్వే వెల్లడించింది. గతంలో ఎన్నడూ సాధించనన్ని స్థానాలు కమలం ఖాతాలో జమకానున్నాయి. కాంగ్రెస్ పార్టీ తొలిసారి అతి తక్కువ లోక్సభ స్థానాలతో సరిపెట్టుకోనుంది.
ఎన్డీయే కూటమికి 226 స్థానాలు లభిస్తాయని, కాంగ్రెస్ కేవలం 81 స్థానాలకే పరిమితమవుతుందని, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన ఆమ్ ఆద్మీ పార్టీ 11 లోక్సభ స్థానాలను దక్కించుకోనుందని సర్వే వెల్లడించింది. అత్యంత ఆమోదయోగ్యమైన ప్రధానిగా నరేంద్ర మోడీకి సర్వేలో పాల్గొన్న 53 శాతం మంది మద్దతు పలకగా, రాహుల్ గాంధీ వైపు కేవలం 15 శాతం మొగ్గు చూపారు.
ప్రధానిగా ఢిల్లీ ముఖ్యమంత్రి, ఎఎపి నేత అరవింద్ కేజ్రీవాల్ని చూడాలనుకున్న వారి శాతం కేవలం 5 మాత్రమే ఉంది. యూపిఏ కూటమికి మరో అవకాశం ఇవ్వకూడదని 61 శాతం అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ వ్యతిరేకత ఎంత బలంగా ఉందో చెప్పడానికి ఇదే నిదర్శనం.
52 శాతం మంది ప్రస్తుత యూపీఏ ప్రభుత్వ పనితీరు కన్నా ఎన్డీయే ప్రభుత్వ పనితీరే మెరుగ్గా ఉందని అభిప్రాయపడ్డారు. ఉత్తర ప్రదేశ్లో 51 శాతం అఖిలేష్ యాదవ్ ప్రభుత్వ పని తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ముజఫర్నగర్ అల్లర్లు బిజెపికి లబ్ధి చేకూరుస్తాయని 42 శాతం అభిప్రాయపడ్డారు. బీహార్లో 72 శాతం బిజెపితో జెడి(యూ) తెగతెంపులు చేసుకోవడం సరికాదన్నారు. 43 శాతం మంది యూపిఏ గవర్నమెంట్ పాలన చాలా దారుణంగా ఉందని చెప్పారు.